
పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వండి!
● కొత్త మేయర్ కొంగొత్త కోరికలు ● ఆనవాయితీ లేదన్న కార్పొరేషన్ అధికారులు ● పోలీస్ కమిషనర్తో మాట్లాడుకోవాలని సూచన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కూర్చున్న తొలి రోజే.. కొత్త మేయర్ పీలా శ్రీనివాసరావు కొంగొత్త కోరికల చిట్టా తెరమీదకు వచ్చినట్టు తెలుస్తోంది. తనకు నగర ప్రథమ పౌరుడి హోదాలో 2 ప్లస్ 2 గన్మెన్లను కేటాయించాలని జీవీఎంసీ ఉన్నతాధికారులను అడిగినట్టు సమాచారం. అయితే జీవీఎంసీ కౌన్సిల్ బుక్ను అమాంతం తిరగేసిన అధికారులు కాస్తా... అటువంటి సౌకర్యం లేదని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఏదైనా ప్రాణాపాయం ఉంటే నేరుగా పోలీస్ కమిషనర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే ఇందుకయ్యే వ్యయాన్ని కూడా జీవీఎంసీ నిధుల నుంచి ఇవ్వలేమని కూడా కుండబద్దలు కొట్టినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ నేప థ్యంలో తన కోరికను నెరవేర్చుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారనేది చూడాల్సి ఉంది.
కూటమి గెలిచినప్పటి నుంచీ..!
వాస్తవానికి సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కాబోయే మేయర్ తానేనంటూ పీలా శ్రీనివాసరావు ప్రచారం చేసుకున్నారు. అనధికారికంగా అధికారులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. స్టాండింగ్ కమిటీలతో సంబంధం లేకపోయినప్పటికీ సమావేశంలో ఏయే అంశాలను అంగీకరించాలి? వేటిని వ్యతిరేకించాలనే విషయంలోనూ జోక్యం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో స్టాండింగ్ కమిటీ సభ్యులే పార్టీలోని పెద్దలకు ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అమరావతి నుంచి పిలుపురావడం.. క్లాస్ పీకడం కూడా జరిగిందని సొంత పార్టీ నేతలే అప్పట్లో పేర్కొన్నారు. అయినప్పటికీ పెద్దగా మార్పురాలేదని, ఆయన తరుపున మరో ఇద్దరు వ్యక్తులు మొత్తం వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్నారని సొంత పార్టీ కార్పొరేటర్లే విమర్శలు గుప్పిస్తున్నారు. అన్ని కాంట్రాక్టు వ్యవహారాలతో పాటు ప్రాజెక్టుల విషయంలోనూ ఇద్దరు శ్రీనులు జోక్యం చేసుకుంటూ కలెక్షన్ కింగులుగా మారారనే ఆరోపలున్నాయి. ఇప్పుడు ఏకంగా మేయర్ పీఠంపై కూర్చోవడంతో తమకు ఎదురులేదనే రీతిలో వ్యవహరించే ప్రమాదం ఉందని కూటమి నేతలే అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.
అంతా ఆ ఇద్దరి హవానే...!
సాధారణ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాగానే... మేయర్ పీఠాన్ని అధిష్టించాలని తన కోరికను ఆయన అధిష్టానం ముందు ఉంచారు. అయితే, నిబంధనల మేరకు నాలుగేళ్ల వరకూ అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం లేకపోవడంతో మిన్నకుండిపోయారు. నాలుగేళ్ల కాలపరిమితి ముగిసిన వెంటనే తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ వ్యవహారాల్లో ఆయన అనుచరులుగా ఉన్న ఇద్దరు శ్రీనుల ప్రమేయం ప్రధానంగా ఉందని తెలుస్తోంది. మేయర్గా పీలా శ్రీనివాసరావు కుర్చీలో కూర్చున్నప్పటికీ... వ్యవహారాలన్నీ ఆ ఇద్దరు శ్రీనులే నడిపించనున్నారు. ఇప్పటికే అనేక వార్డుల్లో తమను పక్కనపెట్టి... వీరి పెత్తనం ఏమిటంటూ సొంత పార్టీ కార్పొరేటర్లే మండిపడుతున్నారు. ఇద్దరు శ్రీనుల వ్యవహారాలను పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రి నేరుగా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. అయినప్పటికీ వారి వైఖరిలో ఎలాంటి మార్పులేకపోగా... తాజాగా మరింత దూకుడు పెరిగినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఇద్దరు శ్రీనుల్లో ఒక శ్రీను ఫోన్ చేయగా... ఒక అధికారి ఫోన్ ఎత్తలేదని ఆయనను బదిలీ చేయాల్సిందేనంటూ పట్టుబట్టినట్టు సమాచారం. తనకు ఆయన ఫోన్ నెంబరు తెలియకపోవడంతో బదులివ్వలేదని సదరు అధికారి బతిమలాడుకోవాల్సి వచ్చిందని జీవీఎంసీలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఇక ఏకంగా మేయర్ పీఠంపై తమ నేత కూర్చోవడంతో ఆ ఇద్దరు శ్రీనులను కట్టడి చేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలను జీవీఎంసీలో చూడాల్సి వస్తుందోననే ఆందోళన కూటమి నేతల్లోనే వ్యక్తమవుతోంది.