
కోడి వ్యర్థాల టెండర్లు రద్దు
కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ నిర్ణయం
డాబాగార్డెన్స్: కోడి వ్యర్థాల సేకరణ, రవాణాలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, అధికార కూటమిలోని అంతర్గత కుమ్ములాటలపై ‘సాక్షి’గత నెల 29న ప్రచురించిన ‘కోళ్ల వ్యర్థాల కోసం కుమ్ములాటలు!’ అనే కథనానికి కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ స్పందించారు. జీవీఎంసీ పరిధిలోని కోడి వ్యర్థాల టెండర్లను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. కోడి వ్యర్థాల సేకరణ వ్యవహారంలో అధికార కూటమిలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. అధికారికంగా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్కు కొందరు నేతలు మద్దతిస్తుండగా, అనధికారిక సేకరణదారులకు మరికొందరు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ దండుబజారులో జరిగిన గొడవ విషయమై మహారాణిపేట పోలీసులపై ఒత్తిడి చేశారు. జీవీఎంసీ అధికారులపై మండిపడుతూ తమ వారే వ్యర్థాలు సేకరిస్తారని, ఎలా అడ్డుకుంటారని గట్టిగా కేకలు వేస్తూ హెచ్చరించారు. అలాగే జీవీఎంసీలోని 8 జోన్లకు సంబంధించి 8 మందికి టెండర్లు అప్పగించడంపై కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ మేరకు జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ వివాదాస్పదంగా మారిన కోడి వ్యర్థాల టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
మేయర్ వర్సెస్ కార్పొరేటర్ : ఇదే అంశంపై గత సోమవారం జీవీఎంసీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రమాదకర కోడి వ్యర్థాల అక్రమ రవాణా, అవినీతిలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, జీవీఎంసీ ప్రజారోగ్య అధికారుల ప్రమేయాన్ని నిరోధించాలని కోరుతూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి నగర మేయర్ పీలా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో మేయర్కు, కార్పొరేటర్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జీవీఎంసీకి మచ్చ తీసుకురావద్దని మూర్తి యాదవ్ సూచించగా.. ‘నా స్థానానికి నీవు విలువ ఇవ్వు. నీ స్థానానికి విలువ తీసుకో’అంటూ మేయర్ మండిపడ్డారు. ఈ క్రమంలో ‘మీ వాయిస్ బాగోలేదు’ అంటూ మేయర్ అతనిపై తీవ్రస్వరంతో హెచ్చరించారు. దీంతో మరోసారి కూటమి పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి.

కోడి వ్యర్థాల టెండర్లు రద్దు