
సవాల్గా జంట హత్య కేసు
కూర్మన్నపాలెం: గాజువాకకు సమీపంలోని రాజీవ్నగర్లో జరిగిన జంట హత్యల కేసు పోలీసు యంత్రాంగానికి సవాలుగా మారింది. దుండగులు ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు వదలకుండా.. అత్యంత పకడ్బందీగా నేరానికి పాల్పడటంతో కేసు ఛేదన పోలీసులకు తలనొప్పిగా మారింది. ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి కేసు దర్యాప్తును అన్ని కోణాల్లోనూ నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
హత్యకు గురైన యోగేంద్రబాబు(66), ఆయన భార్య లక్ష్మి(58) సుమారు 40 ఏళ్లుగా రాజీవ్నగర్ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు. యోగేంద్రబాబు నావల్ డాక్యార్డ్లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. స్థానిక గ్లోరియా(ఎయిడెడ్) పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైర్ అయిన లక్ష్మి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వారికి ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదని స్థానికులు చెబుతున్నారు. వారి ఇద్దరు పిల్లలు శృతి, సుజన్ వివాహాలు చేసుకుని అమెరికాలో స్థిరపడటంతో.. ఇంట్లో వీరిద్దరు మాత్రమే ఉంటున్నారు. ఎవరితోనూ గొడవలు లేని వీరిని ఇంత దారుణంగా ఎవరు, ఎందుకు హత్య చేశారన్నది అంతుపట్టని ప్రశ్నగా మారింది.
బంగారం కోసమా?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన ఇంటి ముందు, వెనుక తలుపులకు బయట నుంచి తాళాలు వేసి ఉన్నాయి. ఇంటి ప్రధాన ద్వారం తెరవగానే యోగేంద్రబాబు మృతదేహం కనిపించింది. లక్ష్మి మృతదేహం బెడ్రూమ్లో ఉంది. ఇంట్లో వస్తువులు కూడా చెల్లాచెదురుగా పడిలేవు. బీరువా తాళాలు కూడా పగలగొట్టినట్లు కనిపించలేదు. ఇది పోలీసులను మరింత గందరగోళానికి గురిచేస్తోంది. సాధారణంగా దొంగతనాలు జరిగితే ఇంట్లోని వస్తువులు అస్తవ్యస్తంగా ఉంటాయి. బీరువాలు పగలగొడతారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. అయితే హతురాలి మెడలో ఎప్పుడూ ఉండే నల్లపూస గొలుసు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. బహుశా బంగారం కోసమే ఈ హత్య జరిగి ఉండవచ్చనే ఓ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయినప్పటికీ ఇతర విలువైన వస్తువులు జోలికి వెళ్లకపోవడం అనుమానం కలిగిస్తోంది.
వెలగని వీధిలైట్లు.. పనిచేయని సీసీ కెమెరాలు
హత్యకు గురైన దంపతులు గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్లు సమాచారం. పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న దాని ప్రకారం గురువారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో ఈ హత్య జరిగి ఉండవచ్చు. అదే సమయంలో రాజీవ్నగర్లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దుండగులు తమ పని కానిచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు ఈ దారుణం వెలుగులోకి రాలేదు. మృతుల బంధువుల కుమార్తె వారిని కలవడానికి ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి తాళం వేసి ఉండటం, లోపల ఫోన్ మోగుతుండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి తలుపులు తెరవగా ఈ ఘోరం వెలుగుచూసింది. ఘటన జరిగిన సమయంలో పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం వంటివి దర్యాప్తునకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. వారి పిల్లలు అమెరికా నుంచి వచ్చిన తర్వాతే ఇంట్లో ఏయే వస్తువులు, ఎంత నగదు, బంగారం పోయిందనే వివరాలు కచ్చితంగా తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు
కేసు ఛేదనకు క్రైం ఏసీపీ డి.లక్ష్మణరావు నేతృత్వంలో నగర క్రైం పోలీసులు, ఇన్స్పెక్టర్లు రాజీవ్నగర్లోనే మకాం వేసి జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేసులో కీలక ఆధారంగా భావిస్తున్న మిస్సింగ్ స్కూటీపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో రిపేర్ కోసం మెకానిక్లు వచ్చి స్కూటీని తీసుకెళ్లేవారని తెలియడంతో, స్థానిక మెకానిక్లందరినీ శనివారం సంఘటనా స్థలానికి పిలిపించారు. హతుల బంధువులతో గుర్తింపు పరేడ్ నిర్వహించారు. అయితే వారెవరూ హతులకు తెలిసిన వారు కాదని బంధువులు చెప్పడంతో పోలీసులు మరో కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. మెకానిక్ కాకుండా మరెవరైనా స్కూటీని తీసుకెళ్లే అవకాశం ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. మృతుల ఇంటి ముందు టు–లెట్ బోర్డు ఉండటంతో.. అద్దెకు కావాలని ఎవరైనా ఇంటి యజమానులను సంప్రదించారా అనే వివరాలను కూడా సేకరించారు. ఇదిలావుండగా దర్యాప్తులో భాగంగా మృతులిద్దరి సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని కాల్ డేటా, ఇతర సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ శంఖ బ్రత బాగ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ కూడా సంఘటనా స్థలం నుంచి కొంత దూరం వరకు వెళ్లి వెనుతిరిగి వచ్చింది. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పంచనామా నిర్వహించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.
రాజీవ్నగర్లో దంపతుల దారుణ హత్య
8 బృందాలతో పోలీసుల దర్యాప్తు

సవాల్గా జంట హత్య కేసు