● రాంగ్ పార్కింగ్ వాహనాలకు తాళాలు ● ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక చర్యలు
సీతమ్మధార: రహదారి భద్రత దృష్ట్యా నగరంలో నెల రోజుల పాటు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు ఆశీలమెట్ట వద్ద రాంగ్ పార్కింగ్లో ఉన్న వాహనాల చక్రాలకు తాళాలు వేసి జరిమానాలు విధించారు. రాంగ్ పార్కింగ్ వాహనాలకు రూ. 1,035 జరిమానా విధించారు. ఆశీలమెట్ట నుంచి సిరిపురం, వీఐపీ రోడ్డులో ర్యాంగ్ పార్కింగ్ చేసిన కార్లు, వ్యాన్లు, ఆటోలకు చలానాలు విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ రాంగ్ పార్కింగ్ వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ సమస్యకు రాంగ్ పార్కింగ్ ఒక కారణమన్నారు. రాంగ్ పార్కింగ్ సమయంలో చలానాలు విధించిన వాహనాలకు అపరాధ రుసుం చెల్లిస్తేనే ఆయా వాహనాలను వాటి యజమానులకు తిరిగి అప్పగిస్తామని తెలిపారు. ప్రమాదాల నివారణ.. సురక్షితమైన ప్రయాణాల నిమిత్తం నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. నగర వ్యాప్తంగా శనివారం సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.