తాండూరు టౌన్: యువత భద్రతకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. శనివారం స్థానిక వినాయక ఫంక్షన్ హాల్లో సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు సురక్ష మిత్ర, రక్షణ నేత్రంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ బంగారు భవితకు బాటలేసుకోవాలన్నారు. సైబర్ క్రైంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. మహిళల రక్షణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. యువతులు, బాలిక రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సురక్ష మిత్ర కార్యక్రమం ద్వారా యువతను చైతన్యవంతం చేస్తున్నామన్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ నీరజ మాట్లాడుతూ.. యువతులు, బాలికలు జాగ్రత్తగా మెలగాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి సురక్ష మిత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సచిన్, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ రాకేశ్ రెడ్డి, కౌన్సిలర్లు వెంకట్, ఎల్లప్ప, పట్టణ సీఐ పరమేశ్వర్, ఎస్ఐలు విఠల్ రెడ్డి, ప్రశాంత్ వర్ధన్, వినోద్ రాథోడ్, నుమాన్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ స్నేహమెహ్ర


