ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి సమీపంలో ఓ ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. సీఐ రఘు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొత్తగడి వైపు నుంచి వికారాబాద్కు వెళ్తున్న కారు.. అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కలీమొద్దీన్(37) తీవ్రంగా గాయపడగా.. అక్బరుద్దీన్, నూరుద్దీన్, నజీర్ హుస్సేన్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. కలీమోద్దీన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆయన అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ తెలిపారు. కాగా ప్రమాద స్థలాన్ని గురువారం ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి, సీఐ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధ్యయనం చేసి, ప్రమాదాలు జరుగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.


