
సగం
ఇంట్లో.. మట్టిలో..
సీజన్ ప్రారంభమై నెల దాటినా 60శాతమే విత్తు
● ఊరిస్తున్న మేఘాలు ● చిరుజల్లులతో సరిపెడుతున్న వరుణుడు ● ఆకాశం వైపు చూస్తున్న అన్నదాత ● పెసర, మినుము, జొన్న సాగు చేయొద్దంటున్న అధికారులు
వికారాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా రైతన్న ఇంకా ఆకాశం కేసి చూడాల్సి వస్తోంది. వరుణుడి కోసం 15 రోజులుగా ఎదురు చూపులు తప్పడంలేదు. వర్షాకాలం ప్రారంభమైంది మొదలు ఒక్కసారి కూడా పెద్ద వాన పడకపోవడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. మొదట్లో అడపా దడపా వర్షాలు కురవగా సగం మంది రైతులు విత్తనాలు వేశారు. ఆ వెంటనే వర్షాలు మొహం చాటేశాయి. వారం రోజులుగా మేఘాలు ఊరిస్తున్నా చిరుజల్లులకే పరిమితం అవుతున్నాయి. పూర్తిస్థాయిలో విత్తుకు సరిపడా పదును కావడం లేదు. ఇప్పటికే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఇళ్లకు తెచ్చుకున్నారు. జిల్లాలో 5.61లక్షల ఎకరాల్లో ఆయా రకాల పంటలు వేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. 60 మిల్లీ మీటర్ల మేర రెండు మూడు సార్లు వర్షాలు కురిస్తేనే విత్తుకు అనుకూలమని అధికారులు అంటున్నారు. అయితే రెండు మూడు మండలాలు మినహా తగినంత వర్షపాతం నమోదు కాలేదు. అదును అయ్యే వరకు విత్తనాలు వేయకపోడమే మేలని అధికారులు సూచిస్తున్నారు. తెచ్చుకున్న విత్తనాలు సగం ఇంట్లో.. సగం మట్టిలో అన్నట్లు పరిస్థితి తయారైంది.
2.90 లక్షల ఎకరాల్లో విత్తనాలు
ఒక వేళ ముందుగా వర్షాలు పడితే రోహిణి కార్తెలో లేదంటే మృగశిర కార్తెలో విత్తనాలు వేస్తారు. ఈ ఏడాది మే 24న రోహిణి కార్తె ప్రారంభమైంది. నెల రోజులు కావస్తున్నా ఇంకా 60శాతం విత్తనాలే వేశారు. 40శాతం విత్తనాలు ఇళ్లలోనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో పెసర, మినుము, జొన్న పంటలు వేయకపోవడమే మంచిదని వ్యవసాయ శాఖ అఽధికారులు అంటున్నారు. జిల్లాలో మొత్తం 5.61లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా ఇప్పటి వరకు 2.90 లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తు వేశారు. ఓ పక్క మేఘాలు ఊరిస్తున్నా సాగుకు సరిపడా మాత్రం కురవడంలేదు. ధైర్యం చేసి కొంతమంది రైతులు విత్తనాలు వేయగా అవి మొలకెత్తుతాయా లేదా అనే ఆందోళనలో రైతన్న ఉన్నాడు. కొన్ని చోట్ల మొలకెత్తాక కూడా ఎండిపోయాయి. మరికొన్ని చోట్ల మొలకెత్తలేదు.
16 పంటల సాగు
జిల్లాలో మొత్తం 16 రకాల పంటలు సాగు చేస్తారు. వీటిలో సింహభాగం పత్తి, కంది, మొక్కజొన్న, వరి పంటలు. గతేడాది క్వింటాలు పత్తి రూ.8 వేలకు పైగా అమ్ముడుపోవడంతో ఈ సారి పత్తి సాగుకు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2.5లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది అంతకు మించవచ్చని అధికారులు అంచనా వేశారు. వరి, కంది సాగు సైతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూరగాయలు, వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది.
ఆ పంటలు వద్దు
ప్రస్తుత సీజన్కు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాం. సరిపడా వర్షాలు లేక సగం మేర విత్తనాలు వేయలేదు. మరో వారం రోజుల పాటు వర్షాలు పడకపోతే పెసర, మినుము, జొన్న సాగు చేయకపోవడం మంచిది. మిగతా పంటలు జూలై వరకు సాగు చేసుకోవచ్చు.
– మోహన్రెడ్డి, డీఏఓ
వర్షాల కోసం ఎదురుచూపు
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా సాగుకు సరిపడా వర్షాలు పడలేదు. మొదట్లో కురిసిన వర్షాలకు విత్తనం వేశాం. ఇప్పుడు వర్షాల జాడలేదు. సాయంత్రం కాగానే కారుమబ్బులు కనిపిస్తున్నాయి. కానీ చినుకులు పడటం లేదు. పొలంలో వేసిన విత్తనాలను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడంలేదు. మరో వారం రోజుల్లో వర్షాలు పడకపోతే ఆర్థికంగా నష్టపోతాం.
– గోవింద్రెడ్డి, రైతు, దౌల్తాబాద్

సగం

సగం