
బయోమెట్రిక్ అమలుకు చర్యలు
● అధికారులు సమయపాలన పాటించాలి ● ప్రజావాణి దరఖాస్తులనుసత్వరం పరిష్కరించాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్
అనంతగిరి: జిల్లా కేంద్రంతోపాటు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సమస్యల పరిష్కారం కోసం 146 దరఖాస్తులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు విధిగా సమయపాలన పాటించాలన్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను పూర్తి స్థాయిలో సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో వన్ మెడీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కొలెస్ట్రాల్, కిడ్నీ, లివర్, కాల్షియం, క్రియాటిన్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. మనుషుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యాలకు గురవుతున్నామన్నారు. నేడు కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు, ఉద్యో గులకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలించే దిశగా ప్రాథమిక, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, ఎం.సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి , డీఎంహెచ్ఓ వెంకటరవణ, వన్ మెడీ హబ్ ఫౌండర్ సంతోష్, డాక్టర్ శ్రీకాంత్, ల్యాబ్ టెక్నీషియన్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.