
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి
● బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి నష్టం జరగనీయం ● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ
షాద్నగర్: సంచనలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కమ్మదనం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరిస్తూ గత పాలకులు స్వార్థరాజకీయాలకు పాల్పడి, ప్రజా జీవితాలకు భంగం కలిగే విధంగా వ్యవహరించారని విమర్శించారు. భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు కూడా వినడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన సూత్రధారులు, పాత్రదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్రంతో మాట్లాడారని, తెలంగాణకు ఏవిధంగా నష్టం జరుగుతుందో స్పష్టంగా వివరించారని తెలిపారు. ఈ విషయంలో కేంద్రానికి స్పష్టత ఉందన్నారు. ఏ ప్రాజెక్టు విషయంలోనైనా తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, నాయకులు మహేందర్రెడ్డి, అశోక్గౌడ్, మోహన్సింగ్, విజయ్ భాస్కర్, ఇస్నాతి శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.