
దళితులపై దాడులను అరికట్టండి
తాండూరు టౌన్: నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో దళితులపై జరుగుతున్న దాడులకు అడ్డకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా, దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. యాలా ల మండలం రాస్నం గ్రామంలోని దళితుల శ్మశాన వాటిక స్థలాన్ని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేసి, సీసీ రోడ్డును తవ్వేశారన్నారు. ఈ విషయం గురించి అడిగేందుకు వెళ్లిన దళితులను కులం పేరుతో దూషించారన్నారు. హాజీపూర్కు చెందిన రవికుమార్ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తుండగా కొందరు వ్యక్తులు దాడి చేశారన్నారు. అలాగే తాండూరు మండలం చెన్గేష్పూర్ గ్రామానికి చెందిన ఎరుకలి కులస్తులైన బస్వరాజ్ దంపతులపై పలువురు దాడి చేసి భభయబ్రాంతులకు గురి చేశారన్నారు. ఇలా నియోజకవర్గ పరిధిలో అగ్ర కులస్తులు.. దళితులపై అకారణంగా దాడులు చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశామన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్, సీఐటీయూ, పలు ప్రజా, దళిత సంఘాల నాయకులు మల్కయ్య, కె.శ్రీనివాస్, బాధితులు ఆశప్ప, అంజిలప్ప, భాస్కర్, లక్ష్మప్ప, వీరప్ప, అంజిలయ్య, రవి, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా, దళిత సంఘాల నేతల డిమాండ్
సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన