
నషా ముక్త్ భారత్ అభియాన్ను విజయవంతం చేద్దాం
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా జిల్లాలో ఈ నెల 20నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనన్నట్లు తెలిపారు. దీనిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. అధికారులు సమన్వ యంతో పని చేసి వికారాబాద్ను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. డ్రగ్స్ మూలాలను గుర్తించి, వాటి రవాణా, విక్రయాలు, వినియోగం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు పెడదోవ పట్టకుండా కాపాడాలన్నారు. విద్యా సంస్థల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేసి అవి క్రియాశీలకంగా పని చేసేలా చూడాలన్నారు. ఈ నెల 25న పాఠ శాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, డీఎంహెచ్ఓ వెంకటరవణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, డీఎస్పీ జానయ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.