
అన్నదాత ఆందోళన
దౌల్తాబాద్: పచ్చటి పైర్లతో కళకళలాడాల్సిన పొలాలు వరుణుడి కరుణ లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమవుతున్నా వానజాడ కనిపించడం లేదు. దీంతో రైతులు దిగులు చెందుతున్నారు. మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. పొలాలను దున్ని విత్తు వేశారు. విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని విత్తనాలు మొలకెత్తినా వర్షాలు లేక ఎండుముఖం పట్టాయి. వేల రూపాయలు వెచ్చించి పత్తి, జొన్న, కంది, పెసర తదితర రకాల విత్తనాలు వేస్తే భూమిపాలయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు దాదాపు రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చు చేశామని రైతులు తెలిపారు. మండల వ్యాప్తంగా దాదాపు 8 వేల ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విత్తనాలు ఉంటాయో ఎండుతాయా అనే ఆందోళనలో రైతన్న ఉన్నాడు.