షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Jun 21 2025 7:19 AM | Updated on Jun 21 2025 7:19 AM

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

మోమిన్‌పేట: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఇల్లు దగ్ధమైన సంఘటన మోమిన్‌పేటలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకొంది. మండల పరిధిలోని చీమల్‌ధరి గ్రామానికి చెందిన మ్యాతరి పర్మయ్య పని నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఇల్లు దగ్ధమైంది. గమనించిన చుట్టు పక్కల వారు మంటలను ఆర్పారు. అప్పటికే ప్రమాదంలో తులం బంగారు నగలు, రూ.3.5లక్షల నగదుతో పాటు, విలువైన డాక్యుమెంట్లు కాలిపోయాయని బాధితుడు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని కోరారు.

ప్రైవేట్‌ బడులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

పరిగి: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ పట్టణ కార్యదర్శి గణేష్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని మాస్టర్‌మైండ్‌ పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్‌ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్య లను కూడా ఏర్పాటు చేయకుండా ఎలా స్కూళ్లను నడుపుతారని ప్రశ్నించారు. అధికారులు పాఠశాలను సందర్శించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు సాయిగణేష్‌, అఖిల్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

వైన్స్‌ ఎదుట సెల్ఫీ తీసుకున్న యువకుడిపై దాడి

మొయినాబాద్‌: వైన్‌ షాపు ఎదుట సెల్ఫీ తీసుకున్న ఓ యువకుడిపై యజమానితోపాటు సిబ్బంది దాడి చేశారు. ఈ సంఘటన మొయినాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కనకమామిడి గ్రామానికి చెందిన యువకుడు రాఘవేందర్‌రెడ్డి గురువారం సాయంత్రం మొయినాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని పెద్దమంగళారం రోడ్డులో ఉన్న వైన్స్‌కు వెళ్లాడు. షాపు ముందు సెల్ఫీ తీసుకున్నాడు. అది గమనించిన సిబ్బంది అతనిపై దాడి చేశారు. అంతలోనే యజమాని శ్రీనివాస్‌గౌడ్‌ సైతం వచ్చి ఫొటో ఎందుకు తీశావంటూ దాడిచేయడంతో సిబ్బంది రెచ్చిపోయి విచక్షణారహితంగా కొట్టారు. కర్రలతో కొట్టడంతో వీపు, కాళ్లు వాతలతో కమిలిపోయాయి. ముఖంపై గాయాలయ్యాయి. బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వైన్స్‌ యజమానితోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement