
దళిత శ్మశానవాటిక రోడ్డు ధ్వంసం
యాలాల: దళిత శ్మశానవాటికకు వేసిన సీసీ రోడ్డును ధ్వంసం చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన దళిత సంఘం నేతలతో కలిసి శుక్రవారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్కయ్య మాట్లాడుతూ.. మండలంలోని రాస్నం గ్రామంలో సర్వే నంబరు 129లో ఎకరా భూమిలో దళితుల శ్మశానవాటిక ఉందన్నారు. దానికి గతంలో సీసీ రోడ్డును ప్రభుత్వ నిధులతో వేసినట్లు చెప్పారు. అదే గ్రామానికి చెందిన కొందరూ వ్యక్తుల ప్రోద్బలంతో రఫీక్, యూసుబీ, మక్తర్, ముఖీద్లు దౌర్జన్యంగా అర్ధరాత్రి వేళ జేసీబీ సాయంతో శ్మశానవాటిక సీసీ రోడ్డును ధ్వంసం చేశారన్నారు. దీన్ని అడ్డుకోబోయిన వారిపై కులం పేరుతో దూషించినట్లు తెలిపారు. నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశప్ప, బాలప్ప, నర్సింహులు, సాయిలు, అంజిలప్ప, భాస్కర్, లక్ష్మప్ప, వీరప్ప, అంజిలయ్య తదితరులు ఉన్నారు.
నిందితులపై అట్రాసిటీ నమోదు చేయాలని కేవీపీఎస్ నాయకుల డిమాండ్