
రుణానికి ఎదురుచూపులు!
దౌల్తాబాద్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువవికాసం పథకం అమలు జాప్యమవుతుంది. యువతకు స్వయం ఉపాధి మార్గంలో నడిపించే సదాశయంతో యువవికాసం పథకాన్ని జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రారంభించాలని హడావుడి చేశారు. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. అర్హుల ఎంపిక పూర్తి చేశారు. జూన్ 2న మంజూరు పత్రాలు అందిస్తామని ప్రకటించిన అధికారులు ప్రభుత్వ నిర్ణయంతో వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు మంజూరు పత్రాలు అందిస్తారో ప్రకటించకపోవడంతో నిరుద్యోగులు ఒకింత నిరాశకు గురవుతున్నారు.
సబ్సిడీ ఇలా
పథకంలో రూ.50 వేల యూనిట్కు వందశాతం సబ్సిడీ, రూ.లక్ష వరకు 90శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు 80శాతం సబ్సిడీ, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు 70శాతం సబ్సిడీ, ప్రభుత్వం అందించనుంది. ఈ నాలుగు కేటగిరీల్లో రూ.50వేలు, రూ.లక్ష యూనిట్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. కానీ చాలా మంది రూ.2 నుంచి రూ.4లక్షల యూనిట్లు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు రూ.50 వేలకు స్థిరమైన ఉపాధి కల్పన సాధ్యం కాదని నిరుద్యోగులు బాహాటంగానే చెబుతున్నారు.
సిబిల్కే బ్యాంకర్ల ప్రాధాన్యం
యువ వికాసం దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీఓల ఆధ్వర్యంలో పరిశీలించారు. తొలుత మండల కమిటీల ఆమోదం తర్వాత జిల్లా కమిటీలకు జాబితా చేరింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికే ఈ పథకం మంజూరు చేస్తారు. గతంలో ఏదైనా కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందారా..? బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని చెల్లించకుండా డిఫాల్టర్గా ఉన్నారా? అనే విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. అయితే ప్రభుత్వం సిబిల్ స్కోర్ పట్టించుకోవద్దని ప్రభుత్వం సూచించింది. మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కార్పొరేషన్ల కింద 1,900 దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఎవరికి అందుతాయోనని దరఖాస్తుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
రాజీవ్ యువ వికాసం అమలులో తీవ్ర జాప్యం
దరఖాస్తులు, విచారణ పూర్తయినా
ముందుకు సాగని వైనం
నిరాశ చెందుతున్న నిరుద్యోగులు
ఆదేశాలు రావాలి
మండలంలో యువవికాసం కింద 1,900 దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లో ఉన్నతాధికారుల సూచనల మేరకు అర్హుల ఎంపిక కూడా జరిగింది. ఈ పథకం అమలు నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది.
– శ్రీనివాస్, ఎంపీడీఓ, దౌల్తాబాద్