
పది సప్లిమెంటరీకి పక్కాగా ఏర్పాట్లు
అనంతగిరి: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 20 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 5,308 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరిగి పట్టణంలో 3 కేంద్రాలు, తాండూరులో 7, కొడంగల్లో ఒకటి, వికారాబాద్లో 5, మోనిపేట్, కుల్కచర్లలో రెండు కేంద్రాల చొప్పున ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్, వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరాదని ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విద్యార్థులకు తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. మాస్ కాపీయింగ్కు అవకాశం ఇవ్వరాదన్నారు. సమావేశంలో డీఈఓ రేణుకాదేవి, డీఎంహెచ్ఓ వెంకటరవణ, ఆర్టీసీ డిపో మేనేజర్ అరుణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్