
సర్కారు వరం.. సన్న బియ్యం
కొడంగల్: నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో జూన్ ఒకటో తేదీ నుంచి ఒకేసారి మూడు నెలల రేషన్ బియాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. లక్షన్నర మందికి ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేయడానికి శ్రీకారం చుట్టారు. రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటారని, వారికి ఇబ్బంది లేకుండా ఒకేసారి చౌకధర దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు నియోజకవర్గంలో 90 రేషన్ దుకాణాల ద్వారా నెలకు 979 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 2,937 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వినియోగదారులకు పంపిణీ చేయనున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి రేషన్ దుకాణాల ద్వారా ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని ఉచితంగా ఇస్తారు. బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేస్తున్నారు.
ఈ పాస్తో పంపిణీ
కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో 90 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 38,395 రేషన్ కార్డులు ఉన్నాయి. 1,46,700 మంది లబ్ధిదారులు ప్రతి నెలా 979 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా బియ్యం తీసుకుంటున్నారు. రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈపాస్) యంత్రాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఐరిష్, వేలిముద్రలు సరిగ్గా ఉంటేనే సరుకులు ఇస్తారు.
సిగ్నల్స్ సమస్య..
పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లోనే రేషన్ దుకాణాలు అధికంగా ఉన్నాయి. పట్టణాల్లో సెల్ఫోన్ టవర్స్ ఉండడం వల్ల సమస్య లేదు. గ్రామాల్లో సిగ్నల్స్ అందక ఈ పాస్ యంత్రాల్లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పలు గ్రామాల్లో సిగ్నల్స్ సరిగ్గా రావడం లేదని లబ్ధిదారులు, డీలర్లు చెబుతున్నారు. అతికష్టం మీద సిగ్నల్ వస్తే సర్వర్ డౌన్ అవుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో సరుకుల పంపిణీలో జాప్యం జరుగుతోందన్నారు. కూలీ పనులు వదిలేసి బియ్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు. అన్ని దుకాణాల్లో ఈ పాస్ యంత్రాలను ఏర్పాటు చేశా రు. దీంతో సరుకులు పంపిణీ చేస్తున్నారు.
లక్షన్నర మందికి ఒకేసారి మూడు నెలల రేషన్
జూన్లో పంపిణీకి శ్రీకారం
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
ఇబ్బంది లేకుండా..
వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని ఒకేసారి జూన్ నెలలో పంపిణీ చేయడానికి ప్రభు త్వం చర్యలు తీసుకుంది. డీలర్లు సకాలంలో దుకాణాలను తెరిచి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మూడు నెలల బియ్యాన్ని ఇవ్వాలి.
– విజయ్కుమార్, తహసీల్దార్

సర్కారు వరం.. సన్న బియ్యం