పెళ్లకూరు: కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అరాచకాలను ప్రశ్నిస్తూనే ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి పలువురు నాయకులు చిల్లకూరులోని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నివాసానికి చేరుకున్నారు. సత్యనారాయణరెడ్డి సతీమణి కామిరెడ్డి ప్రభావతమ్మ, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డి సతీమణి పోలంరెడ్డి శ్రీదేవి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ స్వర్ణముఖినదిలో యంత్రాలతో ఇసుక తోడేస్తుంటే మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ శేఖర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ప్రిస్కిల్లా మరికొందరు రైతులు కలిసి కలవకూరుకు చేరుకొని పరిశీలించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్న కూటమి నాయకులు, కాంట్రాక్టర్పై కేసులు నమోదు చేయాల్సిన పోలీసు యంత్రాంగం అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇలా తప్పుడు కేసులు పెట్టి బెదించాలని చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సామాన్య కార్యకర్త కూడా వెనుకడుగు వేయడని స్పష్టం చేశారు. కూటమి నేతల ప్రలోభాలకు లొంగి తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
మావిగన్ అంటే భయమెందుకు?
రాష్ట్ర రాజధాని విషయమై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నోట మావిగన్ అనే మాట వినగానే కూటమి నాయకుల్లో భయం ఎందుకు మొదలయ్యిందో అర్థం కావడం లేదని కాకాణి అన్నారు. పాలనా వికేంద్రీకరణతో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చారని గుర్తుచేశారు. గడిచిన రెండేళ్ల కూటమి అరాచకపాలనతో ఉద్యోగుల్లోనూ, ప్రజల్లోనూ మార్పు మొదలయ్యిందని, మళ్లీ అభివృద్ధి, సంక్షేమం అజెండాతో జగనన్న అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దాల సోమశేఖర్రెడ్డి, పార్టీ నేతలు కలికి మాధవరెడ్డి, కిశోర్యాదవ్, ఎల్లు మోహన్, ఓడూరు వినోద్కుమార్రెడ్డి, కరణం రఘునాయుడు, పాదర్తి హరినాథ్రెడ్డి, అల్లూరు రాహుల్రెడ్డి, తంబి జనార్ధన్రెడ్డి, కటకం జయరామయ్య, బైనా మల్లికార్జున్రెడ్డి, ఈద రత్నశ్రీ, బాలాజీ, అశోక్, బాలసుబ్రమణ్యం, మునిరాజ, శ్రీదేవి, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదే మా వారసత్వం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జగనన్న ఇచ్చిన ధైర్యమే వారసత్వం అని, కూటమి నేతల ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని కాకాణి పేర్కొన్నారు. సత్యనారాయణరెడ్డిపై మళ్లీ పీటీ వారెంట్ కూడా వేశారని, మరో పీటీ వారెంట్ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదకరమనే విషయాన్ని సత్యనారాయణరెడ్డి గురించి స్థానిక కూటమి నాయకులందరికీ తెలుసని గుర్తుచేశారు. ముఖ్యంగా మాజీ శాసన సభ్యులు సంజీవయ్య సౌమ్యుడని, ఎదుటి వారిని నొప్పించడం తెలియదని అలాంటి ఆయనపై కూడా అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు.


