గాలింపు చర్యలు ముమ్మరం చేసిన
పోలీసులు
తిరుపతి రూరల్: తిరుపతి నగర శివార్లలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. తిరుపతి రూరల్ మండలం రఘునాథరిసార్ట్స్లోని ఓ ఇంటిలోకి శుక్రవారం రాత్రి కిటికీ విరిచి ప్రవేశించారు. చోరీకి పాల్పడే సమయానికి ఇంటి యజమాని పైఅంతస్తు నుంచి గట్టిగా అరవడంతో పారిపోయినట్టు సమాచారం. ప్రమాదకరమైన చెడ్డీ గ్యాంగ్ తిరుపతి పరిసరాల్లో తిరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు.. తిరుపతి నగరంలోని ఆస్టర్ నారాయణాద్రి చైర్మన్ డాక్టర్ సునందకుమార్ రెడ్డి ఇంట్లోకి చొరబడిన ఈ చెడ్డీ గ్యాంగ్ ఇంటి యజమాని లోపల ఉన్నట్టు తెలుసుకుని ఎటువంటి చోరీకి పాల్పడకుండా వెళ్లిపోయారు. అయితే తన ఇంటిలోకి దొంగలు వచ్చి వెళ్లడంపై ఆ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేయాలని సదరు వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి రూరల్ సీఐ మద్దయ్యాచారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖరీదైన ఇళ్లు, దూరంగా ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఒంటిపై దుస్తు లేకుండా కేవలం చెడ్డీ మాత్రమే ధరించి శరీరానికి గ్రీజ్ రాసుకుని తిరిగే ఈ గ్యాంగ్ పర్యటించిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను ఆధారంగా చేసుకుని పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతి క్రైం పోలీసులు పాత నేరస్తుల కదలికలపై దృష్టి పెట్టినట్టు సమాచారం.
ఓ ఇంటి కిటికీ విరిచి
చోరీకి విఫలయత్నం


