రేణిగుంట: తమ గ్రామంలో జరుగుతున్న భూ అక్రమణలపై తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సర్వే నవబర్లతోసహా టైప్ చేసి వివిధ ప్రచార మధ్యమాల్లో పెట్టడంతో స్థానిక అధికార పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు. అధికారులు సైతం ఈ విషయంపై మౌనం పాటించడంలో నిజంగానే అక్రమాలు జరిగాయ అనేది స్థానికంగా చర్చనీయంగా మారింది. వివరాల్లోకి వెళితే.. రేణిగుంట మండలంలోని ఎల్లమండ్యం పంచాయతీలోని కొత్తపాళెంలో కొత్తపాళెం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా సుమారు 8.5 ఎకరాల ప్రభుత్వ అసైనన్డ్ భూమిని అక్రమంగా లేఅవుట్లుగా మార్చి, విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నంబర్లు 146, 147, 149, 150, 151, 152, 153, 155, 156, 157, 158, 159, 166, 172, 173, 174, 175 పరిధిలో ఉన్న సుమారు 8.5 ఎకరాల భూమిని కబ్జాదారులు గుప్పిట్లోకి తీసుకున్నారు. 2005లో ప్రభుత్వం పేదలకిచ్చిన ఈ అసైనన్డ్ భూమిని, రికార్డుల్లో మార్పులు చేసి రియల్ వెంచర్లుగా మార్చారని, కఠినమైన 22ఎ నిషేధిత జాబితాలో ఉన్న సుమారు 1.06 ఎకరాల భూమిని కూడా ఈ అక్రమ లేఅవుట్లో కలిపేశారు. ఈ భూమిలో రోడ్లు వేస్తున్నా, లేఅవుట్ అభివృద్ధి చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ మెసేజ్ వ్యాప్తి చెందడంతో అధికార పార్టీ నాయకులు, స్థానిక రెవెన్యూ అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయమై తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని వివరణ కోరగా సిబ్బందిని పంపి సర్వే చేయిస్తామని, ఏదైనా ఆక్రమణ ఉంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.


