రేణిగుంట: జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ వద్ద నిరంతర నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్లో భద్రపరచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ను గురువారం సాయంత్రం రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, బీయూ, సీయూలు, వీవీ ప్యాట్లను, అక్కడి భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాలు, సీలింగ్ తదితరాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. శ్రీ కాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి, ఈవీఎం గోడౌన్ ఇన్చార్జి, జీఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ వై రమేష్ బాబు పాల్గొన్నారు.
స్విమ్స్లో పేదరోగికి విలువైన శస్త్ర చికిత్స
తిరుపతి తుడా: స్విమ్స్ ఆసుపత్రిలో టీటీడీ ఎస్వీ ప్రాణదాన పథకం ద్వారా నిరుపేద రోగికి ఉచితంగా రూ.5 లక్షల విలువైన శస్త్ర చికిత్స విజ యవంతంగా పూర్తి చేశారు. గురువారం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ రోగిని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లా కోయ్యలగూడెం మండలం, సారిపల్లి గ్రామానికి చెందిన వెంకట సత్యవతి అనే పేద పేషెంట్ వెన్నుముక ట్యూబర్ క్లోసిస్ వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉండటంతో ఆమెకు ఎస్వీ ప్రాణదానం పథకం కింద రూ. 5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించినట్లు చెప్పారు. స్విమ్స్ న్యూరో సర్జరీ, సిటీ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవంతంగా శస్త్రచికిత్స చేసి, పేషెంట్ను గురువారం డిశ్చార్జ్ చేశారు. రోగి, వారి కుటుంబ సభ్యులు డైరెక్టర్కు, టీటీడీకి, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
వ్యవస్థాపకత నైపుణ్యాలపై శిక్షణ
తిరుపతి సిటీ: ఎస్వీయూ హోమ్సైన్స్ విభాగం ఆధ్వర్యంలో రూసా 2.0 సహకారంతో ఫుడ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్ విద్యార్థులకు వ్యవస్థాపకత నైపుణ్యాలు, ఫైర్ స్టార్టర్ అనే అంశంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం వర్సిటీలో జరిగిన శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి వీసీ టాటా నర్సింగరావు ముఖ్యఅతిథిగా హాజరై, ప్రసంగించారు. విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఇలాంటి శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగకరమని, వర్సిటీ విద్యార్థుల ఉన్నతికి అన్ని విధాల ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ విజయ్ మాథూర్, రూసా సీఈఓ వంశీ, కన్వీనర్ ప్రొఫె సర్ సుచరిత, అధ్యాపకులు ఆర్కే అనురాధ, బి స్వరూపారాణి, కే అనురాధ పాల్గొన్నారు.


