తిరుపతి మంగళం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయాలకు సంబంధం లేని వైఎస్.భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషమని మాజీ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. వైఎస్. భారతి ఏరోజూ ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకోరని, కుటుంబం, సేవా కార్యక్రమాలు వరకే పరిమితం అవుతున్నారన్నారు. అలాంటి భారతిపై నిత్యం విమర్శలు చేయడం వారి నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. వైఎస్.భారతి వెంకటప్ప మెమోరియల్ స్కూల్ ద్వారా దాదాపు 2 వేల మంది పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యాబోధన ఉచితంగా అందించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారన్నారు. వైఎస్. జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన రోజు నుంచి రాజకీయంగా ఎదుర్కోలేక భారతిపై నిత్యం ఆరోపణలు చేస్తూ రాజకీయాల్లో ఫేమ్ అవాలనుకునే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైఎస్.భారతి ఏ నాడు ఎవరిపైనా ఆరోపణలు చేయలేదని, ఎవరినీ విమర్శించలేదని, ఎప్పటికప్పుడు హుందాగా నడుచుకుంటూ.. ధైర్యంగా ముందుకు సాగుతూ.. మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళా శక్తి వైఎస్. భారతి అని పేర్కొన్నారు. సమాజంలో గౌరవంగా ఉంటూ, సమాజానికి సేవ చేస్తున్న వైఎస్. భారతిని రాజరీయ లబ్ధి కోసం మహిళలే సమాజం తలదించుకునేలా దుర్భాషలాడడం మహిళా సమాజానికే సిగ్గుచేటన్నారు.
ఎస్వీయూలో జాబ్ మేళా రేపు
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయీమెంట్ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పేరొందిన కంపెనీ ప్రతినిధులు జాబ్మేళాకు హాజరవుతారని, సుమారు 550 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఎస్ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ పూర్తి చేసిన అభ్యుర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు వర్సిటీలోని ఎంప్లాయీమెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.


