భార్య హత్య కేసులో భర్తకు 20 ఏళ్లు జైలు
సూళ్లూరుపేట: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.2 వేలు జరిమానా విఽధిస్తూ నెల్లూరు ఏడీజే కోర్టు న్యాయమూర్తి ఎం సోమశేఖర్ శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. సూళ్లూరుపేట మండలంలోని మన్నేముత్తేరి పంచాయతీ జంగాలగుంటలో 2017 ఫిబ్రవరి 28న రాత్రి పులి మునస్వామి పూటుగా మద్యం సేవించి, భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను నెల్లూరు నారాయణ ఆ స్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ మార్చి 4న మృతి చెందింది. ఈ కేసును అప్పటి సీఐ విజయకృష్ణ విచారించి, నిందితు డిని అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్లు జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
షార్ట్ సర్క్యూట్తో
పూరిల్లు దగ్ధం
చిల్లకూరు: గూడూరు పట్టణంలోని తిలక్నగర్లోని సుజాతమ్మకు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధం అయ్యింది. స్థానికుల కథనం మేరకు.. గూడూరు తిలక్ నగర్లో సు జాతమ్మ నివాసం ఉంది. ఈ క్రమంలో శుక్రవా రం ఉదయం ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి, మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్టోని వారంతా బయటకు పరుగులు తీసి, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినా మంటలు అదుపుకాకపోవడంతో స్థానికులు అగ్నిమాక శాఖ సిబ్బందికి సమాచారం అందజేశారు. అగ్నిమాపకశాఖ వచ్చి మంటలను అదుపు చేసే సరికే ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుజాతమ్మ కుటుంబం కట్టుబట్టలతో మిగిలారు.
జిల్లాస్థాయి విద్యవైజ్ఞానిక ప్రదర్శన నేడు
నాయుడుపేట టౌన్: పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి జరగనున్న జిల్లాస్థాయి విద్యవైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆ ప్రదర్శన నిర్వహణ జిల్లాధికారి కే భానుప్రసాద్ తెలిపారు. ఈ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, డీఈఓ కేవీఎన్ కుమార్తో కలిసి ప్రారంభిస్తారన్నారు. ఏర్పాట్లను జిల్లాధికారి, డిప్యూటీ డీఈఓ దువ్వూరు సనత్ కుమార్ పరిశీలించారు.
రేపు జాబ్ మేళా
తిరుపతి సిటీ: తిరుపతి నగరంలోని శ్రీనివాసపురంలో వున్న హెచ్కేఎస్ జాబ్ సర్వీసెస్ సెంటర్లో ఆదివారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధినేత కేశవప్రసాద్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పలు ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, పీజీ చదివిన అభ్యర్థులు హాజరుకావచ్చని తెలిపారు. వివరాలకు 8978133574, 8522031850 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నారావారిపల్లి శివారులో చిరుత సంచారం
చంద్రగిరి: మండలంలోని నారావారిపల్లి శివారులో శుక్రవారం చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపం వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలోని బండరాయిపై చిరుత పులి కదలికలను స్థానికులు గుర్తించారు. మరికొంత మంది చిరుత పులి వెళుతున్న దృశ్యాలను తమ సెల్ఫోన్లలో బంధించారు. గతంలో ఎన్నడూ చిరుత సంచారం జరిగిన దాఖలాలు లేవని, అయితే నారావారిపల్లి గ్రామానికి సమీపంలో చిరుత పులి సంచరించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
మహిళ దుర్మరణం
మండ్య(కర్ణాటక): కారు గోడను ఢీకొని మహిళ మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఈఘటన మండ్య నగర సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతికి చెందిన దివ్య (26) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. తన కుటుంబంతో కలిసి శుక్రవారం బెంగళూరు నుంచి మైసూరుకు కారులో వెళుతుండగా మండ్య నగర శివార్లలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన గోడను ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో దివ్య మృతి చెందగా గాయపడిన దినేష్, తేజు, ప్రియాంక, డ్రైవర్ సిద్ధిక్ను మిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తరువాత, వారిని మైసూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి సంఘటన స్థలాన్ని సందర్శించారు. మండ్య రూరల్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
భార్య హత్య కేసులో భర్తకు 20 ఏళ్లు జైలు


