రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్
తిరుపతి మంగళం : రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, అందులో భాగంగానే తమ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని పోలీసులు విచారణకు పిలిచారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి విమర్శించారు. టీటీడీకి సంబంధించిన గోశాల గోవులు పెద్ద సంఖ్యలో మరణించడంపై వివరాలు బయట పెట్టారనే కారణంతో గురువారం భూమన కరుణాకరన్నను ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు విచారణకు పిలిచారన్నారు. ఎస్వీ యూనివర్సిటీ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో గోమాతల మరణాలపై భూమన ఆధారాలతో సహా బయటపెట్టారని గుర్తు చేశారు. తప్పుల్ని సరిదిద్దుకోడానికి, వాస్తవాల్ని బయటపెట్టిన భూమనను విచారణ పేరుతో వేధించడం సబబు కాదన్నారు. గోవులే మరణించలేదని సీఎం చంద్రబాబు, అందుకు విరుద్ధంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ వేర్వేరు సంఖ్యలు చెప్పారన్నారు. గోవుల మరణాలపై పాలకుల్లోనే స్పష్టత లేదన్నారు. విచారణ పేరుతో గంటల తరబడి విచారించడం తగదని మండిపడ్డారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, అలాగే నకిలీ మద్యం తయారీ తదితర అంశాలపై తీవ్ర ప్రజావ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ఇలాంటి వాటి నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే భూమనను విచారణకు పిలిచారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా తన పద్ధతుల్ని మానుకుని, హామీల అమలుకు ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


