
బడికి రాకుండా నిరసన
చిల్లకూరు : బడుల విలీనానికి నిరసనగా విద్యార్థులు తరగతులను బహిష్కరించిన సంఘటన గూడూరు రూరల్ ప్రాంతంలోని నెర్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. నెర్నూరులో చదువుతున్న 6,7,8 తరగతులకు చెందిన సుమారు 40 మంది విద్యార్థులను తిరువెంగళాయపల్లి పాఠశాలకు వెళ్లాలని విద్యాశాఖాధికారులు ఆదేశాలు ఇచ్చారు. అలాగే నెర్నూరుకు 3 కి.మీ దూరంలో ఉన్న గొల్లపల్లి, పుట్టంరాజుకండ్రిగ గ్రామాలల్లోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 3,4,5 తరగతుల పిల్లలను నెర్నూరుకు వెళ్లాలని అధికారులు తెలిపారు. దీంతో పాఠశాలలు పునఃప్రారంభించి 15 రోజులు అవుతున్నా విద్యార్థులు బడికి వెళ్లకుండా బహిష్కరించారు. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలను బడికి పంపేది లేదని చెబుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్ధులకు పంపిణీ చేయాల్సిన విద్యా సామగ్రి గదుల్లో బెంచీల మీదనే ఉంచేశారు. పిల్లలు బడికి రాకపోవడంతో టీచర్లు ప్రతి రోజు బడికి వెళ్లి హాజరు వేసుకుని వస్తున్నారు. దీనిపై పాఠశాల హెచ్ఎం వరలక్ష్మిని వివరణ కోరగా దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపలేమని ప్రైవేటు పాఠశాలకు తమ పిల్లలను పంపుతామని తల్లిదండ్రుల చెబుతున్నారని అన్నారు.