
స్టీల్ పరిశ్రమలో గాయపడిన కార్మికుడు మృతి
పెళ్లకూరు : మండలంలోని పెన్నేపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వలస కార్మికుడు జురాల్ యాదవ్(47) గురువారం మృతి చెందినట్లు ఏఎస్ఐ రాఘవయ్య తెలిపారు. పోలీసుల సమాచారం మేరకు ఈనెల 24న స్టీల్ పరిశ్రమలోని పర్నేజ్ ప్లాంట్ వద్ద ఐరన్ లిక్విడ్ ద్రావణం ఉబికి అక్కడ పని చేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడు జురాల్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం చైన్నెకి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధితుడికి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నాయుడుపేటలో చోరీ
– 16 గ్రాముల బంగారు నగలు అపహరణ
నాయుడుపేటటౌన్ : పట్టణంలోని రాజగోపాలపురం వీధిలో గురువారం సాయంత్రం ఓ ఇంటిలో చోరీ జరిగింది. బీరువాలో దాచి ఉంచిన 16 గ్రాములు బంగారు నగలు ( 2 సవర్లు) గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లారు. బాధితుడు తెలిపిన మేరకు వివరాలు.. పట్టణంలోని రాజగోపాలపురం వీధిలో సిద్దలయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. సిద్దలయ్య ఆర్టీసీ బస్టాండులోని దుకాణంలో పనిచేస్తుంటాడు. గురువారం మధ్యాహ్నం సిద్దలయ్య కుటుంబ సభ్యులతో కలిసి సొంతపని మీద బయటకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటి వచ్చేసరికి తలుపుల తాళాలు పగలగొట్టి ఉండడం గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలో ప్రవేశించి బీరువా తాళాలు సైతం పెకలించి, రెండు సవర్లు బంగారు నగలు చోరీకి గురైందని బాధితులు గుర్తించారు. బీరువాలో ఉన్న బంగారు తాళిబొట్లు అక్కడే వదిలిపెట్టినట్లు తెలిపారు. ఈ విషయమై బాధితులు స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ బాబి, ఎస్ఐ ఆదిలక్ష్మి ఐడీ పార్టీ పోలీసులతో చోరీ జరిగిన ఇంటి వద్దకు వెళ్లి పరిశీలన చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

స్టీల్ పరిశ్రమలో గాయపడిన కార్మికుడు మృతి