
‘ఉపాధి’ అక్రమాలపై వేటు
● ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్ ● రూ.3,51,585 రికవరీకి ఆదేశాలు
రేణిగుంట : గత సంవత్సర కాలంలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించి జరిపిన సామాజిక తనిఖీల్లో ఉపాధి అక్రమాలు బయటపడ్డాయి. డ్వామా పీడీ ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసి, రూ.3,51,585 రికవరీకి ఆదేశాలు ఇచ్చారు. రేణిగుంట మండలంలోని 19 పంచాయతీల్లో గత సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రస్తుత సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు జరిగిన ఉపాధిహామీ పనులపై 15 రోజులుగా సామాజిక తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ రావు అధ్యక్షతన సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. పంచాయతీ వారిగా తనిఖీ బృందం నివేదికలను సభ దృష్టికి తీసుకొని వచ్చారు. సామాజిక తనిఖీ బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం రూ.1,37,500 రికవరీ, రూ. 2,14,085 జరిమానా విధించారు. అక్రమాలకు పాల్పడిన టెక్నికల్ అసిస్టెంట్, ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ టి ఎమ్ లోకేశ్వర్ రెడ్డి, ఏపీడి వరప్రసాద్,ఇన్చార్జ్ ఎంపీడీవో ప్రభురావు, గత ఎంపీడీవో విష్ణు చిరంజీవి, అసిస్టెంట్ విజిలెనన్స్ ఆఫీసర్ గణేష్ కుమార్, ఏపీఓ దీప, గత ఏపీవో జ్యోతి శ్రీ, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.