రౌడీషీటర్‌ దారుణహత్య | - | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్‌ దారుణహత్య

Jun 25 2025 1:19 AM | Updated on Jun 25 2025 11:21 AM

చిల్లకూరు : చిల్లకూరు వడ్డిపాళెంకు చెందిన ప్రవీణ్‌కుమార్‌, సుబ్రహ్మణ్యం అనే ఇద్దరు పాత నేరస్థుల మధ్య నెలకొన్న కుటుంబ వివాదాల కారణంగా ప్రవీణ్‌కుమార్‌ను గొంతు కోసి హత్య చేసిన ఘటన చిల్లకూరులోని మేదర కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. చిల్లకూరు వడ్డిపాళెంకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ (25) పాల ఆటో నడుపుతున్నాడు. మద్యానికి బానిసై చిల్లర పనులు చేస్తూ ఇటీవల నాంచారమ్మపేటలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా తేలాడు. రౌడీ షీటర్‌గా పోలీస్‌ రికార్డులో నమోదై ఉన్నాడు. 

వడ్డిపాళెం ప్రాంతానికే చెందిన సుబ్రహ్మణ్యం కూడా గతంలో నేరాలకు పాల్పడి గ్రామం వదలి శ్రీకాళహస్తి సమీపంలో ఉండే పాపానాయుడుపేటలో ఉంటున్నాడు. కొంత కాలం క్రితం సుబ్రహ్మణ్యం మేనమామ కుమార్తెను ప్రవీణ్‌కుమార్‌ ప్రేమించాడు. ఆ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెకు మరొకరితో వివాహం జరిపించారు. ప్రవీణ్‌కుమార్‌ ఆమె వివాహానంతరం కూడా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో సుబ్రహ్మణ్యం పది రోజుల క్రితం వడ్డిపాళెంకు వచ్చి ప్రవీణ్‌కుమార్‌తో వివాదానికి దిగాడు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు జ్యోకం చేసుకుని అతనిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఆ తరువాత సుబ్రహ్మణ్యం మంగళవారం మరోసారి నేరుగా వడ్డిపాళెంకు చేరుకుని ప్రవీణ్‌కుమార్‌తో గొడవకు దిగాడు. 

సుబ్రహ్మణ్యం మేనమామ అతనిని అక్కడి నుంచి పంపించేశారు. అతను చిల్లకూరులో మద్యం తాగి తిరిగి వస్తున్న క్రమంలో ప్రవీణ్‌కుమార్‌ ఎదురు రావడంతో అతడిపై దాడి చేశాడు. ఆపై మేదర కాలనీలోకి తీసుకొచ్చి అక్కడ కత్తితో గొంతు కోశాడు. ప్రవీణ్‌కుమార్‌ కొంత దూరం వెళ్లి అక్కడే మృతి చెందాడు. నిందితుడు సమీపంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. గూడూరు రూరల్‌ సీఐ కిషోర్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో పాటుగా మృతుడి తల్లి పుష్పమ్మ నుంచి ఫిర్యాదు తీసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement