
పైపులైన్ పనులపై వివాదం
– కేవలం బిల్లులు చేసుకునేందుకే పనులు !
పాకాల : పైపులైను ఏర్పాటు చేయడంపై మండలంలోని దామలచెరువులో వివాదం చోటు చేసుకుంది. మంగళవారం స్థానికులు తెలిపిన వివరాల మేరకు మసీదు వీధి, జనపవీధి, సందు వీధులలో సుమారు 1500 మంది ప్రజలు నివసిస్తున్నారు. గతంలో ఉన్న పైపులైన్లో నీరు బాగా వస్తుందని, ప్రస్తుతం ఏర్పాటు చేసిన పైపులైనులో నీరు సరిగ్గా రాదని చెబుతున్నా తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యంగా పైపులైను ఏర్పాటు చేశారని ఆవేదన చెందారు. పైపులైను ఏర్పాటు చేయడంలో వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు నీరు రాకుండా చేయడానికి కక్ష సాధింపు చర్యలలో భాగంగానే పైపులైను ఏర్పాటు చేశారని స్థానిక మహిళలు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ విషయంపై ప్రజలకు న్యాయం చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎఈ నవీన్ని స్థానిక మహిళలు వేడుకున్నా టీడీపీ నాయకులతో మాట్లాడుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.
టీడీపీ నేతల దౌర్జన్యం
దామలచెరువులో పైపులైను సమస్యపై బయట గ్రామాల నుంచి నాయకులను పిలిపించుకుని స్థానిక మహిళలను భయభ్రాంతులకు గురిచేశారు. నేండ్రగుంటకు చెందిన టీడీపీ మండల అధ్యక్షుడు నాగరాజ నాయుడు మహిళలపైకి దూసుకొచ్చి దౌర్జన్యానికి దిగాడని ఆరోపించారు. ముస్లిం మహిళలు అని కూడా చూడకుండా వీరంగం సృష్టించాడని స్థానిక మహిళలు తెలిపారు. కేకలు వేస్తూ సుమారు 100 మంది అల్లరి మూకలతో గొడవ చేసి మహిళలకు తీవ్ర ఇబ్బందులు కలిగించారని వాపోయారు. బయట నుంచి అల్లరి మూకలు ఎందుకు వచ్చారని స్థానిక మహిళలు, మాజీ ఎంపీటీసీ పి.హసీనా ప్రశ్నించారు.
ప్రేక్షకపాత్రలో పోలీసులు
దామలచెరువులో నీటి పైపులైను సమస్యపై బయట నుంచి వచ్చిన అల్లరి మూకలు, రౌడీలు, నాయకుల దౌర్జన్యానికి పాల్పడుతున్నా పోలీసులు అడ్డుకోకపోగా ప్రేక్షకపాత్ర వహించారని స్థానిక మహిళలు ఆరోపించారు.

పైపులైన్ పనులపై వివాదం