
సన్నాహాక రథయాత్ర
సూళ్లూరుపేట : సూళ్లూరుపేట పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 28న నిర్వహించబోయే పూరి జగన్నాథ రథయాత్ర ఏర్పాట్లలో భాగంగా మంగళవారం రథయాత్ర ట్రయల్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరుకు ఇస్కాన్ అధ్యక్షుడు సుఖదేవ్ మహారాజ్ పర్యవేక్షణలో షార్ బస్టాండ్ నుంచి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ సమీపంలోని శ్రీనగర్ కాలనీ వరకు రథయాత్రను నిర్వహించారు. ట్రయల్ రన్లో ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులతో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొని హరేరామ హరేకృష్ణ నామ స్మరణలతో నిర్వహించారు.
పశుగణాభివృద్ధిపై అవగాహన
కలువాయి(సైదాపురం) : పశుగణాభివృద్ధిపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా లైవ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధికారి శ్రీనివాసులు కోరారు. మండల కేంద్రమైన కలువాయిలోని పశువైద్యశాలలో మంగళవారం పలు పథకాలపై రైతులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఎల్డీఏ ద్వారా పాడి రైతులకు వివిధ పథకాలను ప్రభుత్వం మంజూరు చేసిందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్జీఎం ద్వారా మారుమూల ప్రాంతాల్లో 20 వేలకుపైగా దున్నపోతులను పాడి రైతులకు ఉచితంగా అందిస్తామన్నారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది గురు జయంతి, కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు.
వేధింపులపై కేసు నమోదు
కోట : మండలంలోని చంద్రశేఖరపురం గ్రామానికి చెందిన రజినీ అనే వివాహిత తన భర్త దిలీప్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నట్లు మంగళవారం ఎస్ఐ పవన్కుమార్కు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.