
లింగ నిర్ధారణపై కొరడా
● సాయి సర్జికల్ ఆస్పత్రి సీజ్
తిరుపతి తుడా : తిరుపతి త్యాగరాజ్ నగర్ పాత మెటర్నిటీ హాస్పిటల్ రోడ్లోని శ్రీ సాయి సర్జికల్ మెటర్నిటీ హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ ఆదేశాల మేరకు జిల్లా ఇన్చార్జి ఇమ్యునైజేషన్ అధికారి ఛత్ర ప్రకాష్ రెడ్డి, డెమో అధికారులు బాబు నెహ్రూరెడ్డి, కిరణ్ కుమార్ తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో ప్రైవేటు ప్రాక్టీషనర్స్ ద్వారా సాయి సర్జికల్ ఆస్పత్రికి చిత్తూరు, తమిళ నాడు తదితర ప్రాంతాల నుంచి లింగ నిర్ధారణ పరీక్షలకు గర్భిణులను రెఫర్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు అధికారులు మాట్టాడుతూ స్కాన్ సెంటర్ తనిఖీ చేసేందుకు వచ్చిన తమను ఆస్పత్రి ఎండీ డాక్టర్ కిరణ్కుమార్ అడ్డుకున్నారని, తలుపులు మూసివేసి మేనేజ్ చేసేందుకు యత్నించారని వెల్లడించారు. వైద్య విద్యను అభ్యసించని క్లారా అనే ప్రైవేట్ ప్రాక్టీషనర్తో లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిసిందన్నారు. దీనిపై క్లారాను ప్రశ్నించగా తనపై ఆస్పత్రి యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందని, కుటుంబ అవసరాల కోసం లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు అంగీకరించారని తెలిపారు. దీంతో ఆస్పత్రిని సీజ్ చేసి విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.