
బరితెగించిన మట్టి మాఫియా
రామచంద్రాపురం: మండలంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కూటమి నేతల అండతో యథేచ్చగా సహజ సంపదను కొల్లగొడుతూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా మట్టి, గ్రావెల్ను తరలిస్తున్నారని, అక్రమంగా మైనింగ్ చేస్తున్నా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఎం నాయకులు మండిపడ్డారు. వారు సోమవారం రామచంద్రాపురం మండలంలోని పలు ప్రాంతాల్లో పరిశీలించారు.
మండలంలోని కొత్తకండ్రిగ, మిట్టకండ్రిగ, ఎల్వీ పురం, గణేషపురం, రాయలచెరువు, గుండోడు కణం ప్రాంతాల్లో కూటమి నేతలు, మట్టి మాఫియా కలిసి కొండలు, గుట్టలను స్వాహా చేస్తున్నారు. ఈ క్రమంలో సీపీఎం నాయకులు వందవాసి నాగరాజు, జయచంద్ర జిల్లా కమిటీ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారు మాట్లాడుతూ భారీగా గుంతలను చూసి ఓబుళాపురం మైనింగ్ను తలపించేలా ఇక్కడ మట్టి మాఫియా చెలరేగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ యంత్రాలతో కొండలు, గుట్టలను తొలిచి ఎర్రమట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
రామచంద్రాపురంలో రెచ్చిపోతున్న అక్రమార్కులు
వాల్టాకు తూట్లు పొడుస్తున్న వైనం
నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
సీపీఎం నాయకుల క్షేత్ర స్థాయి పరిశీలన
రియల్ ఎస్టేట్, వెంచర్లకు తరలింపు
కొండలు, గుట్టలను తవ్వి తీస్తున్న మట్టిని ఇటుక బట్టీలు, ప్రైవేటు వెంచర్లకు, విక్రయిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నా రెవెన్యూ, పోలీసు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నా కనిపించడం లేదా అని మండిపడ్డారు. భారీగా ముడుపులు తీసుకుంటున్నందువల్లే అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు విక్రయిస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి మట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బరితెగించిన మట్టి మాఫియా