మాజీ మావోయిస్టు లింగప్రసాద్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

మాజీ మావోయిస్టు లింగప్రసాద్‌ మృతి

Jun 24 2025 3:23 AM | Updated on Jun 24 2025 3:23 AM

మాజీ

మాజీ మావోయిస్టు లింగప్రసాద్‌ మృతి

తిరుపతి కల్చరల్‌ : రాయలసీమ రాడికల్‌ విద్యార్థి రాజకీయాలను ప్రభావితం చేసిన మాజీ మావోయిస్టు నేత కొణిదల లింగప్రసాద్‌(ఎల్‌పీ)(63) సోమవారం తెల్లవారుజామున తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారు. మూడు రోజుల క్రితం ఊపిరితిత్తుల వ్యాధితో ఆయన ఆస్పత్రిలో చేరారు. రామచంద్రాపురం మండలం ,రావిళ్ల వారిపల్లెలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన లింగప్రసాద్‌కు భార్య సరోజ(52), కుమారుడు కల్యాణ్‌ శ్రీనివాస్‌(28) ఉన్నారు. మావోయిస్టు ఉద్యమం ఊపిరి పోసుకున్న 1980 దశకం తొలి తరం రాడికల్‌ నాయకులలో ఎల్‌పీగా ఆయన ప్రజాభిమానం చూరగొన్నారు. అనేక పోలీసు కేసులను ఎదుర్కొని జైలు జీవితం గడిపారు. తిరుపతి ఓరియంటల్‌ కళాశాలలో చదువుతూ నాటి పీపుల్స్‌ వార్‌ విప్లవ ఉద్యమంలో అడుగు పెట్టారు. అప్పట్లో చిత్తూరు జిల్లా ప్రజలు ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా బంద్‌ సైతం చేపట్టారు. కుప్పం ప్రాంతంలో కిషోర్‌ పేరుతో అటవీభూముల పోరాటాలకు ఆయన నాయకత్వం వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. 1990లో పార్టీ సైద్ధాంతిక విభేదాలతో ఆయన రహస్య జీవితం నుంచి బయటకి వచ్చి మాజీ మంత్రి పరిటాల రవికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఈ మేరకు కన్నుమూసిన లింగప్రసాద్‌ భౌతిక కాయానికి ఎర్రజెండా కప్పారు. వామపక్ష, మాజీ మవోయిస్టు నేతలు నివాళులు అర్పించారు. ఆనంతరం తిరుపతి మంగళం రోడ్‌లోని వైకుంఠ ధామంలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ మావోయిస్టులు చంద్రశేఖర్‌రెడ్డి, అమ్మ గుంట శంకర్‌, సురేష్‌, తక్కిలిపాటి ప్రభాకర్‌, మదన్‌ శేఖర్‌, శ్రీరాములు, కిషోర్‌, పాదం శివన్న, కేశవులు, ప్రసూన, మేర్లపాక చంద్ర, విజయ, సాహితీ వేత్త, ఫిలిం డైరెక్టర్‌ సౌదా, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు, చిన్నం కాళయ్య, చిన్నం పెంచలయ్య పాల్గొన్నారు.

మాజీ మావోయిస్టు లింగప్రసాద్‌ మృతి1
1/1

మాజీ మావోయిస్టు లింగప్రసాద్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement