
నలుగురు ఎర్రదొంగల అరెస్ట్
చంద్రగిరి : శ్రీవారి మెట్టు మార్గంలో ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ బాలిరెడ్డి సోమవారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఆర్ఐ సాయి గిరిధర్కు చెందిన ఆర్ఎస్ఐ వినోద్ కుమార్ బృందం ఆదివారం రాత్రి భాకరాపేట రేంజ్లోని నాగపట్ల అటవీ పరిధిలోని శ్రీవారిమెట్టు నుంచి చంద్రగిరి వెళ్లే మార్గంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు నిందితులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. దుంగలతో సహా నిందితులను తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ర్యాష్ డ్రైవింగ్ వద్దన్నందుకు దాడి
శ్రీకాళహస్తి: ర్యాష్ డ్రైవింగ్ వద్దని కారును మెల్లగా నడపమన్నందుకు తండ్రీకొడుకులపై మెటాలియన్ అలాయ్స్ పరిశ్రమ ప్లాంట్ ఇన్చార్జి తన అనుచరులతో కలిసి దాడి చేశారు. వివరాలు.. ఆదివారం రాత్రి శ్రీకాళహస్తి మండలం వెలంపాడుకు చెందిన శివకుమార్ అనే ఫొటోగ్రాఫర్ వెంకటగిరిలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి ద్విచక్ర వాహనంలో తండ్రితో కలిసి ఇంటికి వస్తున్నాడు. ఇంతలో ప్లాంట్ ఇన్చార్జి జితేంద్ర అత్యంత వేగంగా కారులో దూసుకెళ్లాడు. దీంతో కింద పడబోయిన శివకుమార్, తండ్రి పరమేశ్వరయ్య అంత వేగంగా ఎందుకు కాస్త నెమ్మదిగా కారు నడపవచ్చుగా అని సూచించారు. దీంతో ఆగ్రహించిన జితేంద్ర దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ శివకుమార్ను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితులే సెక్యూరిటీ పాయింట్ వద్ద అద్దాలు ధ్వంసం చేశారంటూ పరిశ్రమ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కాగా దళితులపై దాడి చసిన జితేంద్ర అతడి అనుచరులపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్,పరమేశ్వరయ్యను సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య, గంధం మణి వెంకటేష్ పరామర్శించారు.