
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: శ్రీవారి భక్తులకు సేవలు అందిస్తున్న ఉద్యోగుల సమస్యలను నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని అధికారులను టీటీడీ ఈఓ శ్యామల రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో పరిపాలనా భవన సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ పరిధిలోని అంశాలకు సంబంధించి వారితో చర్చించి అనుమతులు తీసుకుని పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం కోసం ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ఫండ్ కేటాయింపులో, ఇతర అలవెన్స్ల చెల్లింపులో అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. నిబంధనల ప్రకారం పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలు చేపట్టాలని సూచించారు. జీఎన్బీ, ఎస్వీ పూర్ హోమ్, కే.టీ.వినాయకనగర్, రామనగర్ ప్రాంతాల్లోని టీటీడీ క్వార్టర్స్లో డ్రైనేజీ సమస్యలు, భవనాల లీకేజీలు, విద్యుత్ వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇప్పటికే కేటాయించిన ఇళ్ల స్థలాలపై వివిధ శాఖల అనుమతుల విషయంలో సీనియర్ అధికారులతో కమిటీ వేసి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ, డిఎల్వో వరప్రసాద్ రావు, వివిధ శాఖల డిప్యూటీ ఈఓలు, ఉద్యోగులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీ సీ షెడ్ వద్దకు చేరింది. సోమవారం అర్ధరాత్రి వరకు 84,258 మంది స్వామివారిని దర్శించుకోగా 33,502 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.90కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.