
విరామం.. వీడ్కోలు!
● పీజీ పరీక్షలు రాసి వర్సిటీని వీడిన విద్యార్థులు ● బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు పలికిన స్నేహితులు ● ఆశీస్సులు అందించిన అధ్యాపకులు
తిరుపతి సిటీ : ఎస్వీయూ, పద్మావతి మహిళా యూనివర్సిటీలకు గురువారం నుంచి సెలవులు ప్రకటించారు. పీజీ కోర్సుల పరీక్షలు ముగించుకుని హాస్టల్ నుంచి తమ సామగ్రిని తీసుకుని పలువురు విద్యార్థులు స్వస్థలాలకు బయలు దేరారు. పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు బుధవారం ఎస్వీయూ ఆడిటోరియం సమీపంలో వీడ్కోలు పలికారు. మిత్రులందరూ గుమికూడి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉన్నతంగా ఎదగాలని పరస్పరం విషెస్ చెప్పుకున్నారు. రెండేళ్లుగా కళాశాల, హాస్టళ్లలో కలిసి మెలసి తిరిగిన విద్యార్థులు ఒక్కసారిగా భావోద్వేగాలకు గురయ్యారు. చిరునామాలను ఇచ్చిపుచ్చుకుంటూ సెల్ఫీలు తీసుకున్నారు.
గురువుల ఆశీస్సులతో కంటతడి
పీజీ పరీక్షలు రాసిన విద్యార్థులు చివరిసారిగా తాము విద్యనభ్యసించిన తరగతి గదుల వద్దకు చేరుకున్నారు. క్లాస్ రూమ్లోని మొదటి సంవత్సరం విద్యార్థులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ తమ అధ్యాపకులను కలుసుకున్నారు. ఈక్రమంలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ ప్రొఫెసర్ బి.దేవప్రసాదరాజు తన వద్దకు విద్యార్థులను ఆశీర్వదించారు. గురువు ఆశీస్సులను చెమర్చిన కళ్లతో విద్యార్థులు స్వీకరించారు. అలాగే వేసవి సెలవులను పురస్కరించుకుని వర్సిటీల్లోని విద్యార్థులు తమ ఇళ్లకు బయలుదేరి వెళ్లారు. విద్యకు విరామం లభించడంతో పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలని అధ్యాపకులు సూచించారు.

విరామం.. వీడ్కోలు!

విరామం.. వీడ్కోలు!