
కూటమి ప్రభుత్వం.. చేసింది శూన్యం
తిరుపతి మంగళం : మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. మంగళవారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో ఎంపీ గురుమూర్తి, తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడు మేడా రఘునాథరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డితో కలిసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై బుధవారం వెన్నుపోటు దినం పాటిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఏడాది పాలనలో 800 మందికిపైగా వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన సూపర్సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నుపోటు దినంగా నామకరణం చేశారని, ఆ మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల నిరసనలు తెలిపి వినతిపత్రాలు సమర్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సత్యనారాయణపురం నుంచి ర్యాలీ
తిరుపతి జీవకోన మార్గంలోని సత్యనారాయణపురం సర్కిల్ నుంచి బుధవారం ఉదయం 9గంటలకు భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి తెలిపారు. సత్యనారాయణపురం నుంచి తిరుమల బైపాస్రోడ్డులోని మున్సిపల్ పార్క్ వరకు నిరసన ర్యాలీ కొనసాగుతుందని వెల్లడించారు. అనంతరం తిరుపతి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించనున్నట్లు వివరించారు.