దడ పుట్టిస్తున్న జూనోటిక్‌ డిసీజెస్‌ | Zoonotic diseases are causing panic | Sakshi
Sakshi News home page

దడ పుట్టిస్తున్న జూనోటిక్‌ డిసీజెస్‌

Jun 25 2025 4:35 AM | Updated on Jun 25 2025 8:52 AM

Zoonotic diseases are causing panic

జంతువుల నుంచి మనుషులకు పెరిగిన సంక్రమణలు

75–80 శాతం వైరస్‌లు ఈ రకానికి చెందినవే

జూనోటిక్‌ వ్యాధుల తీవ్రత భారత్‌లోనూ అధికమే

రక్షణకు వ్యక్తిగత, కమ్యూనిటీ, ఆరోగ్య వ్యవస్థల స్థాయిలో చర్యలు

 ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్‌ కె. శ్రీనాథ్‌రెడ్డి సూచన

సాక్షి, హైదరాబాద్‌: పట్టణీకరణ పెరిగిపోవటం, జంతు– మనిషి సాన్నిహిత్యం అసాధారణంగా పెర­గ­టంతో మనషుల్లో ‘జూనోటిక్‌ డిసీజెస్‌’(జంతు­వుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు) పెరిగి­పోతున్నాయి. ప్రస్తుతం 75–80 శాతం దాకా వైరస్‌­లు ఇలాగే మనుషులకు వ్యాపిస్తున్నాయని అధ్య­య­నాల్లో తేలింది. భారత్‌ గత కొన్ని దశాబ్దాలుగా అనేక సంక్రమణ వ్యాధులతో పోరాడుతున్నా.. ఇటీ­వల జూనోటిక్‌ వ్యాధుల వ్యాప్తి వేగం పెరిగింది. కరోనా, డెంగ్యూ, రేబిస్, నిఫా వైరస్, లెప్టోస్పై­రోసిస్, క్యాసనూర్‌ ఫారెస్ట్‌ డిసీజ్‌ (మంకీ ఫీవర్‌), స్వైన్‌ ఫ్లూ, ఎబోలా, ఆంథ్రాక్స్, బర్డ్‌ ఫ్లూ, హెపటై­టిస్‌–ఈ, మలేరియా వంటి వ్యాధులు మనుషు­లను పీడిస్తున్నాయి. 

వీటిని అరికట్టేందుకు ముందుగా పర్యావరణ విధ్వంసాన్ని, విచక్షణారహితంగా వన్యప్రాణులకు నష్టం చేయడాన్ని తగ్గించాలని వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్ల్యూడబ్లూŠఎఫ్‌ ఇంటర్నేషనల్‌) సంస్థ ‘కోవిడ్‌–19: అర్జంట్‌ కాల్‌ టు ప్రొటెక్ట్‌ పీపుల్‌ అండ్‌ నేచర్‌’అనే నివేదికలో సూచించింది. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని ప్రాణాంతక వ్యాధులు మానవాళిని ఇబ్బందిపెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మనుషుల్లో ఇన్‌ఫెక్షన్లు సోకడం ద్వారా వ్యాపించే మొత్తం 1,200 వ్యాధుల్లో 816 (75 శాతం) జూనోటిక్‌ డిసీజెస్‌లేనని నిపుణులు చెబుతున్నారు. 

భారత్‌లో జూనోటిక్‌ వ్యాధుల తీవ్రతకు ఉదాహరణలు.. 
» 2025 నాటికి భారత్‌లో నమోదైన కరోనా కేసులు 4.5 కోట్లు.. 2021లో దేశంలో కరోనా మరణాలు 5.33 లక్షలు
» రేబిస్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో మనదేశంలోనే 36% ఉంటున్నాయి.
» 2023–24లో దేశంలో విజృంభించిన మొత్తం వ్యాధుల్లో 47% జూనోటిక్‌ డిసీజ్‌లే.
» నిఫా వైరస్‌ 2018 నుంచి ప్రతి ఏడాది కేరళలో విజృంభిస్తూనే ఉంది.
» 2024లో కుక్క కాట్లు ఆంధ్రప్రదేశ్‌లో 2,45,174, తెలంగాణలో 1,21,997 నమోదయ్యాయి. రేబిస్‌ వల్ల కర్ణాటకలో 2024లో 42 మంది మరణించారు. 
» 2024లో డెంగ్యూ కేసులు తెలంగాణలో 10,077, కర్ణాటకలో 32,000, తమిళనాడులో 26,740 వెలుగు చూశాయి.
» గతేడాది చికున్‌ గున్యా (సస్పెక్టెడ్‌) కేసులు తెలంగాణలో 13,592 రికార్డయ్యాయి.

జూనోటిక్‌ వ్యాధుల పెరుగుదలకు కారణాలు
అనియంత్రిత పట్టణీకరణ, వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన, సహజ వనరులపై మనుషుల మితిమీరిన జోక్యం

వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యలు
» వన్‌ హెల్త్‌ సర్వైలెన్స్‌ గ్రిడ్‌ ఏర్పాటు
» రాష్ట్రస్థాయిలో డిజిటల్‌ మోడల్‌ ఆస్పత్రులు, వెటర్నరీ క్లినిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ ల్యాబ్స్‌ను ఒకే డాష్‌బోర్డ్‌తో అనుసంధానించటం.
» రోగ లక్షణాలు బయటపడకముందే నీటి నమూ­నాలు, గాలిలో వ్యాధి జన్యువుల పర్యవేక్షణ.
» సంయుక్త బృందాల ద్వారా ఎకో సర్వేలు, రోగ నిర్ధారణ పరీక్షలు.
» కొత్త వైరస్‌లను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయటం.
» పిల్లలు, రైతులు, శ్రామికులు, వలసదారులకు ప్రత్యేక హెల్త్‌ ఎడ్యుకేషన్‌.

తెలుగు రాష్ట్రాల్లో హెల్త్‌కేర్‌ వ్యవస్థ బలాబలాలు 
బలాలు
» సర్వేలు, అధ్యయనాల్లో వృద్ధి: గతేడాది నుంచి రేబిస్‌ను నోటిఫయబుల్‌ వ్యాధిగా గుర్తించడం వల్ల డేటా సేకరణ మెరుగైంది.
ఐసీఎంఆర్‌ జోక్యం: తెలంగాణ, పంజాబ్, అస్సాంలలో కబేళాల్లో జూనోటిక్‌ పాథోజెన్లపై రియల్‌టైం మానిటరింగ్‌ ప్రారంభించారు.
ఒకే వైద్య విధానంపై దృష్టి: హైదరాబాద్‌ కేంద్రంగా పశుసంరక్షణ, పర్యావరణం, హెల్త్‌ డిపార్ట్‌­మెంట్లు కలిసి పనిచేయడం ప్రారంభించాయి. 

బలహీనతలు
»  క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం
»  బలహీనమైన గ్రామీణ ప్రజారోగ్య వ్యవస్థ
»  మనుషుల్లో రోగనిరోధకత తగ్గిపోవటం

కబేళాల్లో బయోసేఫ్టీ ప్రొటోకాల్‌ తప్పనిసరి చేయాలి
రాబోయే రోజుల్లో జూనోటిక్‌ డిసీజెస్‌ వ్యాప్తి తీవ్రంగా పెరగబోతోంది. కొన్ని వ్యాధులు స్థానిక ప్రాంతాలకే పరిమితమైతే, కొన్ని మహమ్మారులుగా మారి ఇతర దేశాలకు కూడా వ్యాప్తిచెందే ప్రమాదం ఉంది. వీటి నుంచి రక్షణకు వ్యక్తిగత, కమ్యూనిటీ, ఆరోగ్య వ్యవస్థల స్థాయిలో చర్యలు చేపట్టాలి. 

వ్యక్తిగత రక్షణకు మాస్కులు ధరించటం, నివసించేచోట గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం, తాజా పండ్లు, కూరగాయలు తినటం, 6–8 గంటలపాటు నిద్ర ద్వారా రోగనిరోధక వ్యవస్థను పరిరక్షించుకోవాలి. వన్యప్రాణులు, పెంపుడు జంతువులు, మనుషుల్లో ‘మైక్రోబియల్‌ సర్వైలెన్స్‌’ను పటిష్ట పరచాలి. కబేళాల్లో బయోసేఫ్టీ ప్రొటోకాల్‌ను తప్పనిసరి చేయాలి. – డాక్టర్‌ కె. శ్రీనాథ్‌రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement