‘మేలు’ కలయిక మరింత పెరగాలి

Telangana Raising Livestock Breeds Development - Sakshi

పశువుల కృత్రిమ గర్భధారణ ఏటేటా పెరుగుతున్నా.. జాతీయస్థాయిలో వెనుకబాటు

మేలుజాతి పశు సంతతి, పాల దిగుబడి పెంపే లక్ష్యం 

ఇప్పటివరకు 1.25 కోట్ల పశువులకు గర్భధారణ 

క్షేత్రస్థాయిలో గోపాలమిత్రల సహకారంతో కార్యక్రమం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పశు సంపద పెంపుదల, నాణ్యమైన పశుజాతుల అభివృద్ధి కోసం అమలవుతున్న కృత్రిమ గర్భధారణ కార్యక్రమం ఏటేటా ఊపందుకుంటోంది. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 1.25 కోట్ల పశువులకు కృత్రిమ గర్భధారణ చేపట్టినట్టు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎల్‌డీఏ) లెక్కలు చెప్తున్నాయి.

పల్లెల్లో గోపాలమిత్రల సహకారంతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టుతో మేలుజాతి గేదెలు, ఆవుల సంతతి వృద్ధి చెందుతోందని.. తద్వారా పాల ఉత్పత్తి కూడా పెరుగుతోందని అధికారులు తెలిపారు. 2014లో 13.7 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయగా.. 2019–20లో అత్యధికంగా 18.9 లక్షల పశువులకు కృత్రిమ గర్భాన్ని అందించగలిగినట్టు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి 16.9 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేసినట్టు 
తెలిపారు. 

జాతీయ స్థాయితో పోలిస్తే వెనుకే.. 
పశువుల కృత్రిమ గర్భధారణ విషయంగా జాతీయ స్థాయి గణాంకాలతో పోలిస్తే తె లంగాణ కొంత వెనుకబడే ఉంది. జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం మూడోదశ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్‌లో తెలంగాణలో ఏ ఒక్క జిల్లా కూడా 50శాతం లక్ష్యాన్ని పూర్తిచేయలేకపోవడం గమనార్హం. 2019–20 సంవత్సరానికి గాను కేంద్రం పెట్టిన లక్ష్యాల్లో.. నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కేవలం 9 శాతమే పూ ర్తిచేయగలిగారు. అత్యధికంగా గద్వాలలో 46%, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 43% పశువులకు మాత్రమే కృత్రిమ గర్భధారణ చేయ గలిగినట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 

కృత్రిమ గర్భధారణ ఎందుకు? 
పశువుల్లో గర్భధారణ కోసం ఆడ, మగ జాతి కలయిక కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చని.. ఆడ పశువు ఎదకు వచ్చిన 36 గం టల్లోనే ఈ కలయిక జరగాల్సి ఉంటుందని పశువైద్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. అంతేగాకుండా మేలుజాతి మగ పశువులు ఎక్కు వగా అందుబాటులో లేకపోవడం కూడా సమస్యగా ఉందని అంటున్నాయి.

మేలుజాతి పశువుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చే యించడం వల్ల.. పశువులు మేలుజాతి దూడలకు జన్మనివ్వడంతోపాటు వాటి ద్వారా అధిక పాల దిగుబడి లభిస్తుందని వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశువులకు గర్భధారణ కార్యక్రమాన్ని చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నాయి. 

కరీంనగర్‌ కేంద్రంగా.. 
రాష్ట్రంలో కరీంనగర్‌ కేంద్రంగా పశువుల వీర్యకణాల వృద్ధి సంస్థ కొనసాగుతోంది. అక్కడ మేలుజాతి (ముర్రా జాతి) దున్నపోతులను పూర్తి జాగ్రత్తలతో పెంచుతారు. వాటి నుంచి వీర్యాన్ని సేకరించి రైతులకు, పశువుల పెంపకందారులకు అందజేస్తుంటారు. ఈ బ్రీడింగ్‌ సీజన్‌ ఏటా అక్టోబర్‌ నుంచి ప్రారంభమై ఫిబ్రవరి చివరివారం వరకు కొనసాగుతుంది. బర్రెలు చలికాలంలో ఎక్కువగా ఎదకు వస్తే.. ఆవులు ఫిబ్రవరి నుంచి జూన్‌ మధ్య ఎదకు వస్తాయి. ఈ సమయాన్ని గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం గ్రామాల్లో గోపాలమిత్రల సేవలను వినియోగించుకుంటారు.

గోపాలమిత్రలకు ప్రోత్సాహకం కట్‌ 
వీర్యకణాల వృద్ధి సంస్థ నుంచి పశువుల వీర్యాన్ని స్ట్రాల రూపంలో ఇస్తారు. ఒక్కో స్ట్రాకు రూ.25 చొప్పున వీర్యకణాల వృద్ధి సంస్థకు చెల్లిస్తారు. ఆ వీర్యాన్ని పశువుల్లో ప్రవేశపెట్టేందుకు గోపాలమిత్రలకు రూ. 50 ప్రోత్సాహకంగా ఇస్తారు. సదరు పశు వు గర్భం ధరిస్తే రూ.100, ఈనితే మరో రూ.150 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతులు కూడా ఒక్కో పశువుకు కొంత సొమ్మును గోపాలమిత్రలకు ఇస్తుంటారు. అయితే ఈ ఏడాది గోపాలమిత్రలకు చెల్లించే ప్రోత్సాహకం రూ.50లో రూ.15 కోతపెడుతూ పశుగణాభివృద్ధి కమిటీలు తీర్మానం చేశాయి. మరీ రూ.35 మాత్రమే ఇవ్వడంపై గోపాలమిత్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top