ఓపెన్ స్కూల్ విద్యార్థులంతా పాస్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే టెన్త్, ఇంటర్ విద్యార్థులను పరీక్షలు లేకుండా పాస్ చేసిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఓపెన్ స్కూల్ విధానం ద్వారా విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను కూడా పరీక్షలు లేకుండా పాస్ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. కరోనా క్లిష్ట సమయంలో పరీక్షలు లేకుండానే ఓపెన్ స్కూల్ విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు 35 మార్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి చదువుతున్న 35 వేల మంది, ఇంటర్ చదువుతున్న 43 వేల మంది ఉత్తీర్ణత సాధించనున్నారు.
(విద్యా బోధన.. వయా వీడియో పాఠాలు)