
పురస్కార గ్రహీతలతో గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురొచ్చినా చదువులో ఓటమిని అంగీకరించవద్దని విద్యార్థులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఎన్ని సవాళ్లు ఎదురొచ్చినా ఎదుర్కోగలనన్న ఆత్మవిశ్వాసం విద్యార్థుల్లో ఉండాలని ఆమె సూచించారు. తాను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో ఒక్క సెమిస్టర్లో కూడా ఫెయిల్ కాలేదన్నారు. 3వ సంవత్సరం కోర్సులో ఉండగా కుమారుడు, హౌజ్ సర్జన్గా పనిచేస్తున్నప్పుడు కుమార్తె పుట్టినా చదువులపై ఏమాత్రం ప్రభావం పడకుండా కష్టపడి కొనసాగించినట్టు తెలిపారు.
జీ–20 సదస్సుపై విద్యార్థుల్లో అవగా హన కల్పించేందుకు రాజ్భవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన, వక్తృత్వ, లోగో తయారీ పోటీల్లో విజేతలకు మంగళవారం ఆమె రాజ్భవన్ దర్బార్ హాల్లో పురస్కారాలను అందజేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సును దే శంలో నిర్వహిస్తుండటం గర్వకారణమని, తెలంగాణలో సైతం ఇందుకు సంబంధించిన 6 ఈవెంట్లను నిర్వహించనున్నారని తెలిపారు. రాజ్భవన్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను ప్రారంభించనున్నామని, త్వరలో సీపీఆర్ చాలెంజ్ను నిర్వహించనున్నట్టు తెలిపారు.