ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిచేది బీజేపీనే!

Telangana: bandi sanjay Comments On trs Government - Sakshi

టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభమైంది 

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

నల్లగొండ టూటౌన్‌: దళిత ముఖ్యమంత్రి, దళితబంధు, డబుల్‌ బెడ్‌రూంల, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇలా అన్నింటా ప్రజలను మోసం చేసిన టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. శనివారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల జోనల్‌ సమావేశంలో బండి మాట్లాడారు.

కేంద్ర పథకాలు అమలు చేయకుండా ఇక్కడి ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరిస్తోందని, తెలంగాణలో కూడా డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని, ఇక్కడ బెంగాల్‌ తరహా పాలన సాగదన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలంటే కేసీఆర్‌ ప్రభుత్వం భయపడుతోందని, అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేసి కోర్టు తీర్పును కూడా అమలు చేయలేదన్నారు.

పలు జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ గూండాలు దాడులు చేస్తున్నారని, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా అక్కడికి వచ్చి కొడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కరీంనగర్‌లో బీజేపీ కార్యకర్త రాంచరణ్‌పై దాడి చేస్తే సిరిసిల్లలో చికిత్స తీసుకుంటున్న అతన్ని కిడ్నాప్‌ చేశారని, దీనిపై డీజీపీ, ఆ జిల్లా ఎస్పీ స్పందించాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసే స్టేషన్లను సెటిల్‌మెంట్‌ కేంద్రాలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top