
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సంతాపం తెలపనున్న సభ
తెలంగాణ ఏర్పాటులో ఆయన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ నివాళి
సోమవారం ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. దేశాన్ని ఆర్థిక చిక్కుల నుంచి బయటపడేసి, అభివృద్ధి పథంలో పయనించేలా మార్గనిర్దేశం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు నివాళులు అర్పించనుంది. దేశానికి మార్గం చూపిన ఆయనకు భారత రత్న ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల అనంతరం ఈ నెల 21న సభ నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే.
అయితే సభను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇంకా ప్రోరోగ్ చేయకపోవడంతో.. ఈ నెల 30న సోమవారం ప్రత్యేక భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభించనున్నట్టు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు శనివారం లేఖ విడుదల చేశారు. ఈ ప్రత్యేక సమావేశం ఒక్కరోజుకే పరిమితం చేయనున్నారు.
మన్మోహన్ను కొనియాడుతూ తీర్మానం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 3వ తేదీ వరకు ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నాయి. ఈ క్రమంలో మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయన కృషిని కొనియాడుతూ తీర్మానం చేయడం ద్వారా నివాళి అర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఆధునిక భారత దేశ ఆర్థిక సంస్కర్తగా పేరుగాంచిన మన్మోహన్కు ‘భారతరత్న’ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రత్యేక భేటీకి ప్రతిపక్ష నేత కేసీఆర్
మాజీ ప్రధాని మన్మోహన్కు నివాళి అర్పించేందుకు సోమవారం నిర్వహిస్తున్న అసెంబ్లీ ప్రత్యేక భేటీకి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మన్మోహన్ నేతృత్వంలోని కేబినెట్లో కొంతకాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్.. పలు సందర్భాల్లో ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సహకారాన్ని రికార్డుల్లో చేర్చాలని కోరుతూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు కూడా. ఈ నేపథ్యంలో మన్మోహన్ కృషిని కొనియాడుతూ, నివాళి అర్పించే అసెంబ్లీ ప్రత్యేక భేటీకి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.