
గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థుల ఆందోళన
జనగామ జిల్లా: ‘మా సార్ను అనవసరంగా డిప్యుటేషన్పై పంపించారు. మా సార్ మాకే కావాలి’.. అంటూ జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మున్సి పాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశా లలో విద్యార్థినులు శనివారం పాఠశాల గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. స్థానిక గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఇన్చార్జి హెడ్ మాస్టర్గా ధరావత్ రాజు నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల పాఠశాలలో జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఉన్నతాధికారులు రాజును హనుమకొండ జిల్లా ఆరెపల్లి ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు డిప్యుటేషన్పై బదిలీ చేశారు.
రాజు శనివారం పాఠశాల నుంచి కారులో వెళ్తుండగా.. పలు వురు విద్యార్థులు ‘సార్.. వెళ్ళొద్దంటూ’ కన్నీరు పెట్టుకున్నారు. పాఠశాల గేటు వద్ద దాదాపు ఐదు గంటల పాటు నిరసన తెలిపారు. రాజు సార్ తమపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారని, పదో తరగతిలో 100 ఉత్తీర్ణత కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఆర్డీవో డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఐ జి.వేణు, ఎస్ఐ వినయ్కుమార్ పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థినులు వినకపోవడంతో కలెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఫోన్లో కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆదేశాల మేరకు.. నెల రోజుల్లో రాజు సార్ను పాఠశాలకు రప్పిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.