లొకేషన్‌తో మూడు గంటలపాటు ఛేజింగ్‌ | Police Chasing A Man In Hyderabad | Sakshi
Sakshi News home page

లొకేషన్‌తో మూడు గంటలపాటు ఛేజింగ్‌

Dec 10 2024 7:57 AM | Updated on Dec 10 2024 12:33 PM

Police Chasing A Man In Hyderabad

అదృశ్యమైన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు  

బంజారాహిల్స్‌: అదృశ్యమైన వ్యక్తిని లొకేషన్‌ సాయంతో మూడు గంటలపాటు ఛేజింగ్‌ చేసిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం... బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–3లోని షౌకత్‌నగర్‌ బస్తీకి చెందిన షేక్‌ ఫిరోజ్‌ (42), నందినగర్‌కు చెందిన యువతిని ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో భార్యతో గొడవ పడి గత సెప్టెంబర్ 1వ తేదీన ఫిరోజ్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన భర్త కనిపించడం లేదంటూ బాధితురాలు అదే రోజు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదైంది. 

అయితే ఇంటి నుంచి వైజాగ్‌కు వెళ్లిపోయిన ఫిరోజ్‌ తన ఫోన్‌లో పాత సిమ్‌కార్డు తొలగించి కొత్తది వేసుకొని వినియోగిస్తున్నాడు. అయితే ఫిరోజ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టిన బంజారాహిల్స్‌ ఎస్‌ఐ కె. రమేష్‌ నెలరోజుల నుంచి తన తల్లి, సోదరుడు, మిత్రుడితో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లుగా గుర్తించాడు. ఈ క్రమంలో ఫిరోజ్‌ వాడే ఫోన్‌ లొకేషన్‌ ద్వారా రైలులో హైదరాబాద్‌ వస్తుండగా గుర్తించి సోమవారం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వెళ్లారు. అయితే అప్పటికే ఫిరోజ్‌ మెట్రో రైలు ఎక్కాడు. మళ్లీ ఫోన్‌ లొకేషన్‌ తీసుకున్న ఎస్‌ఐ మెట్రో రైల్‌లో బేగంపేట వైపు వెళ్తున్నట్లు గమనించి రోడ్డు మార్గంలో ఛేజ్‌ చేస్తూ యూసుఫ్‌గూడ మెట్రో రైల్వేస్టేషన్‌ వరకు వెళ్లాడు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో అంతకుముందే ఫిరోజ్‌ మెట్రో దిగి రహమత్‌నగర్‌ వైపు వెళ్లాడు. 

మళ్లీ ఎస్‌ఐ లొకేషన్‌ తీసుకోగా రహమత్‌నగర్‌ పీజేఆర్‌ విగ్రహం చూపించింది. వెంటనే అక్కడికి వెళ్లగా పోలీసులకు దొరక్కుండా మాస్క్‌ ధరించి ఉన్న ఫిరోజ్‌ను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం విచారించి అతడి భార్యకు అప్పగించారు. సుమారు మూడు గంటలపాటు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రహమత్‌నగర్‌ వైపు ఫిరోజ్‌ను పట్టుకోవడానికి ఎస్‌ఐ చేసిన ప్రయత్యాన్ని పలువురు అభినందించారు.  

ఎస్సై హరీశ్, యువతి ఆడియో సంభాషణ వైరల్‌


 

Advertisement
 
Advertisement
Advertisement