మెండోరాలో అత్యధికంగా 46 డిగ్రీలు
అగ్నిగుండంలా రాష్ట్రం.. మరో రెండ్రోజులూ ఇదే పరిస్థితి: వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్/పెద్దవూర: వేసవి ఎండలతో రాష్ట్రం అగ్నిగుండంలా మండుతోంది. దీంతో ప్రజలు అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. ఆదివారం నిజామాబాద్ జిల్లా మెండోరలో అత్యధికంగా 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

రానున్న రెండ్రోజులు కూడా వాతావరణం ఇదే తరహాలో ఉంటుందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు వడదెబ్బ తగిలి నల్లగొండ జిల్లాలో ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడిని సంగారం గ్రామానికి చెందిన మాతంగి మదారు, ముత్యాలమ్మ దంపతుల కుమారుడు మాతంగి విక్రం (16)గా గుర్తించారు.


