
దక్షిణ, మధ్య మహారాష్ట్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ, మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకు వాలి ఉండగా, మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. శనివారం ఉత్తరాంధ్ర తీరం, దాని పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, తాజాగా వాయవ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంలో విలీనమైంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
దక్షిణ ప్రాంత జిల్లాలతోపాటు ఉత్తర ప్రాంతంలోని కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రా ష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు సోమవారం కురిసే అవకాశం ఉన్న ట్టు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల సాధారణం కంటే 4డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.