
ఏర్పాటుచేయాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
సౌకర్యవంతంగా ఇంటిగ్రేటెడ్సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
భూధార్ నంబర్ల కేటాయింపునకు ప్రణాళికలు రూపొందించాలి
రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై సమీక్షలో సీఎం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూములకు భూధార్ నంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంబోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రెవెన్యూ సదస్సుల్లో వారసత్వ, మ్యుటేషన్కు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. లైసెన్స్డ్ సర్వేయర్లు సర్వే చేసిన అనంతరం రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్రూ్కటినీ చేసేలా చూడాలని ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో నూతనంగా నిర్మించనున్న 10 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నమూనాలను సీఎం పరిశీలించారు. ప్రతి కార్యాలయంలో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండాలని, కార్యాలయాలు ప్రజలకు స్నేహపూర్వక వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని సూచించారు.
హైదరాబాద్లో హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచర్గా ఉన్న ప్రాజెక్టుల్లోని సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. సమీక్షలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, కేఎస్ శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్ పాల్గొన్నారు.