Hyderabad: పగటిపూట అగ్గి రాజుకుంటే బుగ్గే!!

If Fire Accidents Occur At Morning, Fire Engines Hard To Come On Busy Roads In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌లోని చందన బ్రదర్స్, కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్, బషీర్‌బాగ్‌లోని మొఘల్‌ కోర్ట్‌లో ఉన్న నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా, పంజాగుట్టలోని మీనా జ్యువెలర్స్, బోయగూడ స్క్రాప్‌ గోదాం, తాజాగా సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జి.. ఇలా నగరంలో ఇప్పటి వరకు జరిగిన పెద్ద అగ్ని ప్రమాదాలన్నీ రాత్రి పూటే జరిగాయి. దాంతో అగ్నిమాపక శకటాలు వీలైంనంత త్వరగా ఘటనాస్థలికి రాగలిగాయి.

అదే ఈ స్థాయి ప్రమాదాలు పగలు జరిగితే.. ట్రాఫిక్‌ చక్ర బంధనాల్ని ఛేదించుకుని ఫైరింజన్లు ఘటనాస్థలికి రావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. ఆలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ అంశంలో 2016 నాటి ఫైర్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ సిఫారసులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. రాత్రి వేళల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో రోడ్లపై రద్దీ ప్రభావం అగ్నిమాపక యంత్రాలపై పడట్లేదు. ఫలితంగా అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి మంటలను అదుపు చేయగలుతుగున్నాయి.  

నిబంధనలు.. వాస్తవాలు..  
► నిబంధనల ప్రకారం రాజధానిలో ప్రతి 5 చదరపు కి.మీటర్లకు ఒక అగి్నమాపక శకటం అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో చూస్తే 41 చదరపు కి.మీ.లకు ఒకటి చొప్పున అందుబాటులో ఉన్నాయి.  

►50 వేల మంది రక్షణకు ఓ అగంరిమాపక శకటం అవసరం. నగరం విషయానికి వస్తే 2011 అధికారిక లెక్కల ప్రకారం చూసినా గ్రేటర్‌ పరిధిలో కనిష్టంగా 175 ఫైర్‌ స్టేషన్లు, దానికి మూడు రెట్ల సంఖ్యలో శకటాలు అవసరం. ప్రస్తుతం నగరంలో ఉన్నవి కేవలం 15 ఫైర్‌ స్టేషన్లు, 50 లోపు శకటాలు. ఈ లెక్కన సుమారు మూడు లక్షల మందికి ఒకటి అందుబాటులో ఉన్నట్లు. 

►అగ్నిమాపక శకటం గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణించగలగాలి. కానీ ప్రస్తుతం నగరంలో వాహనాల సరాసరి వేగం 20–25 కిమీ మించట్లేదు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు గరిష్టంగా 15 నిమిషాల్లో అగి్నమాపక శకటం అక్కడకు చేరాలి. నగర రోడ్ల పరిస్థితిని బట్టి ఏ వాహనమైనా ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లాలంటే కనీసం 30 నిమిషాలు పడుతుంది. 

►బహుళ అంతస్తు భవనాల్లో మంటల్ని ఆర్పడానికి ఉపకరించే హైడ్రాలిక్‌ ఫైరింజన్‌ కేవలం సికింద్రాబాద్‌లోనే ఉంది. వీటికి తోడు అగి్నమాపక శాఖలో ఉండాల్సిన మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది సంఖ్యతో ఇబ్బందులున్నాయి. 2016లో పార్లమెంట్‌ అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో స్టాండింగ్‌ ఫైర్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ ఏర్పాటు చేసింది. దీని అధ్యయనం ప్రకారం పరిధిని బట్టి కాకుండా సమాచారం తెలిసిన తర్వాత ఘటనాస్థలికి చేరడానికి పట్టే సమయం (రెస్పాన్స్‌ టైమ్‌) ఆధారంగా ఫైర్‌ స్టేషన్లు ఉండాలని సిఫార్సు చేసింది. 

► రెస్పాన్స్‌ టైమ్‌ నగరాలు, పట్టణాల్లో అయిదు నుంచి ఏడు నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 20 నిమిషాలుగా నిర్ధారించింది. ఈ స్థాయిలో ఫైర్‌స్టేషన్ల ఏర్పాటు కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని, రాష్ట్రాలకు అవసరమైన నిధులు కేటాయించాలని సిఫార్సు చేసింది. ఇవన్నీ ఇప్పటికీ ఫైళ్లకే పరిమితమయ్యాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top