అయ్యో.. ఐఫోన్‌ అందకపాయె..!  | GHMC Standing Committee Members Miss Apple IPhone Gift At Hyderabad | Sakshi
Sakshi News home page

అయ్యో.. ఐఫోన్‌ అందకపాయె..! 

Dec 19 2020 7:01 AM | Updated on Dec 19 2020 7:01 AM

GHMC Standing Committee Members Miss Apple IPhone Gift At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఆపిల్‌ ఐఫోన్‌ ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఐఫోన్‌ కొనుగోళ్లపై స్టాండింగ్‌ కమిటీ నిర్ణయాన్ని నిరవధికంగా నిలిపివేసినట్లు మునిసిపల్‌ పరిపాలనశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో మాట్లాడి స్టాండింగ్‌ కమిటీ నిర్ణయాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ంఎసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు 15 మందితోపాటు మేయర్, డిప్యూటీ మేయర్‌లకు, ముగ్గురు అధికారులకు కూడా ఐఫోన్లు (12 ప్రోమాక్స్‌ మోడల్‌–512 జీబీ డేటా) కానుకగా అందజేసేందుకు గురువారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది నగరంలోని వివిధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో, ప్రభుత్వం శుక్రవారం ఈనిర్ణయం తీసుకుంది. చదవండిగూగుల్, ఫేస్‌బుక్‌లతో ఆదాయం పంచుకోవాలి 

గతంలో జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ ఆమోదం పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని  ప్రతియేటా స్టాండింగ్‌ కమిటీ సభ్యులకు ల్యాప్‌టాప్‌లు/ట్యాబ్‌లు తదితరమైనవి బహుమతులుగా అందజేయడం ఆనవాయితీగా ఉండేదని పేర్కొంటూ అదే తరహాలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2020–21) బడ్జెట్‌ ఆమోదం పొందిన సందర్భంగా  స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, మేయర్, డిప్యూటీ మేయర్‌లకు అందజేసేందుకు స్టాండింగ్‌ కమిటీలో ఆమోదం తెలిపారు. దాంతో పాటు మేయర్‌ ఐదేళ్ల పదవీకాలం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా  మేయర్‌ కార్యాలయంలోని ముగ్గురు సీనియర్‌ అధికారులకు కూడా ఈ ఫోన్లు అందజేసేందుకు ఆమోదం తెలిపారు. ఈ అంశం నగరంలో చర్చనీయాంశంగా మారడంతో కొనుగోళ్ల నిర్ణయాన్ని నిలిపివేశారు. ఈ ఐఫోన్ల విలువ ఒక్కొక్కటి దాదాపు రూ. 1.60 లక్షలు వంతున  మొత్తం 20 ఫోన్లకయ్యే వ్యయం దాదాపు రూ. 32 లక్షలు. కార్పొరేటర్లకు కానుకలపై  గతంలో ఒకసారి హైకోర్టులో పిల్‌  దాఖలు కావడంతో అప్పట్లో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం తెలిసిందే. చదవండి: ఐటీకి తెలంగాణ బంగారు గని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement